మనకు తెలిసింది గోరంత తెలియంది కొండంత… ఇది సామెత కాదు… పక్కానిజం. ఈ విశ్వంలో కొత్త విషయాలుగా చెప్పడబుతున్న, ఇప్పుడు మనం వినియోగిస్తున్న అంశాలు కొన్నే. కానీ, మనకు తెలియని విషయాలు కోటాను కోట్లుగా ఉన్నాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత బలీయంగా మారింది. బలి చక్రవర్తికి బాలీ దీవులకు సంబంధం ఏంటి? బలి చక్రవర్తికి నేడు మనం చూస్తున్న అమెజాన్ అడవులకు సంబంధం ఏంటి? అసలు అమెరికాను కనుగొన్నది ఎవరు? కొలంబస్ కంటే వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో మహా సామ్రాజ్యాలు ఉన్నాయా అనే అంశాలు మానవ మేధస్సును తొలిచివేస్తున్నాయి.
దీనికి సమాధానం కనుగొనడం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఈ విషయాలన్నీ తెలియాలంటే మనకు బలి చక్రవర్తి గురించి తెలుసుండాలి. బలి చక్రవర్తి తండ్రి గురించి తెలిసుండాలి. బలి చక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడి మనవడు… విరోచనుడి కుమారుడు. ప్రహ్లాదుడి గురించి మనందరికీ తెలుసు. ఆయన హిరణ్యకశిపుడి కుమారుడు. ప్రహ్లాదుడి కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నారసింహావతారం ఎత్తగా, ఆయన మనవడు బలికోసం వామనావతారం ఎత్తాడు. శ్రీమహావిష్ణువు ఎత్తిన తొలి మానవ రూపం వామనావతారం. వామనావతారం ఎత్తడానికి ఓ కారణం ఉంది.
బలి చక్రవర్తి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. తనకున్న అపారమైన శక్తితో స్వర్గలోకాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటాడు. కానీ, దేవతల రాజైన ఇంద్రుడి చేతిలో ఓటమిపాలౌతాడు. ఓటమిని జీర్ణించుకోలేని బలి చక్రవర్తి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి పలు వరాలు పొందుతాడు. ఈ వరాలను అడ్డుగా పెట్టుకొని మరోమారు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని తరిమేసి స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు. దానవ రాజే అయినప్పటికీ బలి చక్రవర్తి పరిపాలన దేవతల కంటే మహోన్నతంగా ఉంటుంది. దానధర్మాలు చేయడంలో ఆయనకు మించినవాడు లేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే చక్రవర్తి ఆయన.
దేవతల స్వర్గాన్ని ఆక్రమించుకున్నా…ఏదో ఒకనాటికి స్వర్గం తిరిగి ఇంద్రుడి వశం అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో రాజగురువు శుక్రాచార్యుడు ఓ సలహా ఇస్తాడు. వెయ్యి అశ్వమేథయాగాలు చేయమని చెబుతాడు. ఒక్క అశ్వమేథయాగం పూర్తి చేయాలంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. ఒక్కో యాగానికి కనీసం నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్ సరిపోతుంది. అటువంటిది సహస్ర అశ్వమేథ యాగాలు చేయడం అంటే మాటలా. కానీ, శుక్రాచార్యుడు చెప్పినట్టుగా సహస్ర అశ్వమేథయాగాలు చేసేందుకు సిద్దమౌతాడు. సిద్ధం కావడమే కాదా దాదాపుగా యాగం పూర్తికావొస్తుంది కూడా. ఈ విషయాన్ని గమనించిన కశ్యపుని భార్య, దేవతల తల్లి అతిది శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తుంది. అభయం ఇచ్చిన శ్రీమహావిష్ణువు అతిది కడుపున వామనుడిగా జన్మిస్తాడు. ఆ తరువాత యాగం నిర్వహిస్తున్న బలి వద్దకు వెళ్లడం మూడు అడుగుల భూమి కోరడం… భూమి ఇచ్చేందుకు సిద్ధం కావడం, బలిని పాతాళానికి తొక్కడం వంటి కథనాలు మనకు తెలుసు.
పాతాళలోకం అంటే ఎక్కడ ఉంది… అన్నది మనకు తెలియని ప్రశ్న. ఇది తెలియాలంటే మనం బాలి దీవులకు వెళ్లాలి. బాలీ దీవులే పాతాళలోకం అని చెబుతారు. బలి చక్రవర్తి అక్కడే రాజ్యాన్ని ఏర్పాటు చేసి పరిపాలన సాగించారని అంటారు. ఇండోనేషియాలో 90 శాతం ఇస్లామ్ను పాటిస్తున్నా… బాలీలో 90శాతం మంది హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. నేటీకి మనకు అక్కడ ఆలయాలు, దేవతారాధన, గణపతికి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. బలి చక్రవర్తి పరిపాలించాడు కాబట్టే ఈ ప్రాంతానికి బాలీ అనే పేరు వచ్చిందని అంటారు. బలిచక్రవర్తి సహస్ర అశ్వమేధ యాగం చేయడంతో ఆయనకు శాశ్వత ఇంద్ర పదవి పొందాలి. కానీ, ఆ ఇంద్రపదవి ఎప్పుడు వస్తుంది అంటే కలియుగం ముగిసిన తరువాత సావర్ణి మన్వంతరం మొదలౌతుంది. అప్పుడే ఆయనకు ఇంద్రపదవి దక్కుతుంది.
మరి అప్పటి వరకు బలి చక్రవర్తి ఏం చేయాలి… ఎక్కడ ఉండాలి అంటే దానికి సమాధానాలున్నాయి. పాతాళలోకాన్ని అంటే బాలీ దీవులను పరిపాలించిన బలి చక్రవర్తి తన తండ్రి విరోచన చక్రవర్తి పరిపాలించిన అమెరికా ఖండానికి వెళ్లినట్టుగా చెబుతారు. ఈ అమెరికా ఖండమే నరకలోకం అని కూడా అంటారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో అత్యంత పురాతనమైన నగరం ఒకటుంది. అదే తివానాకు. ఈ నగరాన్ని స్థాపించింది విరోచనుడే అని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి ప్రజలు విరోచన అనే పేరుతో ఆయన్ను పూజిస్తుంటారు. కొన్ని యుగాలకు పూర్వమే ఈ ప్రాంతంలో గొప్ప నాగరికత వెల్లివిరిసినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, దక్షిణ అమెరికాలోని ఇంకా నాగరికత ప్రజలు కూడా విరోచన చక్రవర్తిని తమ ఆరాధ్యదైవంగా పూజించారు. తన తండ్రి తరువాత ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బలి చక్రవర్తి ఆ ప్రాంతాన్ని కలియుగం ఆరంభం వరకు పరిపాలించారని చెబుతారు. కలియుగం ఆరంభం కాగానే బలి చక్రవర్తితో పాటు మరికొందరు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో అత్యంత రహస్యంగా జీవిస్తున్నారని, కలిప్రభావంతో అస్తవ్యస్థంగా మారిన ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడటం లేదని అంటారు.
దీనికి కూడా కొన్ని రుజువులు ఉన్నాయి. ప్రపంచానికి ఊపిరిపోస్తున్న అమెజాన్ అడవులు 9 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవుల గురించి మనకు తెలిసింది కేవలం 30 శాతం మాత్రమే. నేటికీ మనుషులు అడుగుపెట్టడానికి వీలుకాని 70 శాతం అడవి రహస్యంగానే మిగిలిపోయింది. ఈ 70 శాతం అడవిలో ఏముంది. ఎలాంటి జీవులున్నాయి…ఎలాంటి మనుషులు ఉన్నారు ఎలాంటి జీవజాతులు ఉన్నాయి అన్నది రహస్యమే. వీటి గురించి తెలుసుకోవాలని మనిషి తహతహలాడుతున్నా… ఆ రహస్యాలను చేధించడం అసాధ్యమనే చెప్పాలి.