తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు ఊరెరిగారు. స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వరదరాజస్వామి మాడవీధుల్లో వేచి ఉన్నారు. స్వామివారికి మంగళహారతులు ఇస్తూ ఆయన్ను ఆహ్వానించారు.
యోగశాస్త్రం ప్రకారం సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి చిహ్నం. ఏ భక్తుడైనా సరే సింహానికి ఉన్న బలం ఉండాలని, అటువంటి బలం ఉన్న భక్తుడిని స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గోవిందుడు రాక్షసులకు సింహంలాంటివాడని, ఆయన బలపరాక్రమాల ముందు రాక్షసుల బలం తుత్తుతుత్తు అవుతుందని స్తోత్రవాఙ్మయం చెబుతున్నది. అందుకనే గోవిందుడు తన వాహనసేవలో సింహవాహానాన్ని కూడా ఒకటిగా చేర్చుకున్నారని అంటారు.
ఈ వాహన సేవ అనంతరం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామివారు, అమ్మవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్ల రసాలతో స్వామిని అభిషేకించారు. సాయంత్రం 5.30 నుంచి 5 వరకు ఊంజల్ సేవను, రాత్రి 7 నుంచి 9 వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఊరెరిగారు. జూన్ 2 నుంచి జూన్ 10 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక్కొక్కరోజు ఒక్కొక్క వాహనంపై స్వామివారు ఊరెరుగుతున్నారు.