పరమాచార్య…రమణులు ఒక్కటే… ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

Paramacharya and Ramana Maharshi Are One – This Truth Will Surprise You

చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని పరమాచార్య అని పెరియస్వామి అని పిలుస్తారు. మన తెలుగు భాషలో చెప్పాలంటే ఆయన నడిచే దైవం. ఎక్కడికైనా సరే ఆయన కాలినడకన వెళ్తూ ధర్మాన్ని ప్రచారం చేశారు. పీఠాన్ని అధిష్టించి పీఠాథిపతిగా నియమితులైనవారు వాహనాలు ఎక్కకూడదనే నియమం ఉంది. ఈ నియమానుసారమే ఆయన కాలినడకన వెళ్తుండేవారు. ఈ విధంగానే పరమాచార్యులవారు ఓసారి అరుణాచలం వచ్చారు. అరుణాచలం వచ్చినవారెవరైనా సరే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయాల్సిందే. ఈ విధంగానే పరమాచార్యుల వారు గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యలో రమణుల ఆశ్రమం వద్దకు వచ్చి ఆశ్రమం వైపు చూశారట.

సాక్షాత్తు కుమారస్వామి నివశిస్తున్న ప్రదేశంలా అనిపించింది పరమాచార్యుల వారికి ఆ ఆశ్రమం వైపు చూస్తుండగా… ఆ ఆశ్రమంలో ఉన్న భక్తులు, రమణుల శిష్యులు పరుగుపరుగున బయటకు వచ్చి ఆయనకు సాష్టాంగపడ్డారు. వారివైపు తథేకంగా చూస్తూ చేతితో ఆశీర్వదించినట్టుగా దీవించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత శిష్యులు ఆశ్రమం లోపలికి వెళ్లి…పరమాచార్యులవారు వచ్చారు కదా…. ఆయన్ను దర్శించుకునేందుకు మీరెందుకు బయటకు రాలేదని రమణులను అడుగుతారు. దానికి రమణులు చెప్పిన సమాధానం విని శిష్యబృందం, భక్తజనం ఆశ్చర్యపోయారు. అరుణాచలంలో పరమాచార్యులు, రమణులు అనే ఇద్దరు ఉన్నారా… ఇద్దరూ వేరువేరా… అని అంటాడు. మొదటి నుంచి రమణులు చెప్పిన మాటలు ఇవే. శరీరం వేరు, ఆత్మవేరు. ప్రతి ఒక్కరిలోనూ ఉండే ఆత్మ ఒక్కటే. అది పరమాత్మతో సంయోగం చెందాలని చూస్తుంది. ఏ ప్రాణిలో ఉన్న ఆత్మ అయినా లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఆత్మపై మనం ఈ శరీరాన్ని కప్పుకొని వేరు వేరు భావనతో ఉండిపోయాం. ఆత్మతత్వాన్ని తెలిసినవారికి అంతా ఒక్కటే అనే భావన కలుగుతుంది. రమణులైనా, పెరియస్వామి అయినా లేదా సామాన్య మానవులైనా ఒక్కటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *