నమ్మి పూజిస్తే ఎంతటి కష్టం వచ్చినా ఆ భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. ఈ విషయం ఎన్నో సందర్బాల్లో రుజువైంది. తిరుపతి జిల్లాలోని కాళహస్తి రాజ్యాన్ని కాపాడే విషయంలోనూ ఇది మరోమారు రుజువైనట్టుగా కాళహస్తి శాసనం మనకు స్పష్టం చేస్తున్నది. శ్రీకాళహస్తి అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాళహస్తి క్షేత్రం. శ్రీ అనే సాలీడు, కాళం అనే పాము, హస్తి అనే ఏనుగు శివుడికి పూజ చేసి మోక్షం పొందాయి. ఈ కథ గురించి మనందరికీ తెలిసిందే. ఈ కథలో మనం కాళహస్తిరాజును, రాజ్యాన్ని అమ్మవారు ఎలా రక్షించారు అన్నది తెలుసుకుందాం.
ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు పొరుగు దేశపురాజు తన వద్ద ఉన్న అతిపెద్ద సైన్యంతో హటాత్తుగా దండెత్తాడు. పొరుగుదేశపు రాజు హటాత్తుగా దండెత్తడంతో కాళహస్తి రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. తన వద్ద ఉన్నది కొద్దిపాటి సైన్యమే. పైగా యుద్ధానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కూడా ఆయన వద్ద లేవు. ఏం చేయాలో తెలియక కాళహస్తి రాజు తన కులదైవమైన జ్ఞాన ప్రసూనాంబను ప్రార్థించాడు. ఈ కష్టం నుంచి బయటపడేలా చూడాలని అమ్మను వేడుకున్నాడు. యుద్ధం చేయకుండా వెన్నుచూపి పారిపోవడం రాజు లక్షణం కాదు. ఎంతటి కష్టమైనా సరే ఎదుర్కోవాలని నిర్ణయించుకొని యుద్ధం చేసేందుకు సిద్దమయ్యాడు కాళహస్తి రాజు.
ఈ యుద్ధంలో శతృరాజు మొట్టమొదటిసారి తుపాకులను ఉపయోగించాడు. కత్తుల కంటే తుపాకులు శక్తివంతమైనవి. దూరం నుంచే శతృవులను చీల్చిచెండాడే తత్వం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధంలో కాళహస్తిరాజు ఓడిపోవడం ఖాయమని అనుకున్నారు. ఫిరంగులు, తుపాకుల ముందు మామూలు కత్తులు ఇతర ఆయుధాలు పెద్దగా నిలవవనే సంగతి తెలిసిందే. అందరిలోనూ కాళహస్తిరాజు ఓడిపోతాడు… అయితే, యుద్ధం ఎన్ని రోజుల్లో ముగుస్తుంది అన్నది అనుమానం ఉంటుంది. కానీ, అనూహ్యంగా ఈ యుద్ధంలో కాళహస్తిరాజు విజయం సాధించాడు. ఇది ఎలా సాధ్యమైందో రాజుకు కూడా అర్థం కాలేదు. అమ్మవారిని తలచుకొని రాత్రి నిద్రపోతుండగా… కలలో జ్ఞానప్రసూనాంబ కనిపిస్తుంది. తనకు చీరపెట్టమని అడుగుతుంది.
అమ్మవారు అడిగిన దానికి రాజు ఆశ్చర్యపోతాడు. అమ్మ నీకు చీరలు లేకపోవడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. వెంటనే అమ్మవారు తన పవిటను చూపుతూ తుపాకీ గుళ్ల వలన చీర ఇలా అయిందని, తుపాకి గుళ్లు నీకు, నీ సైన్యానికి తగలకుండా చెంగు అడ్డం పెట్టాను అని చెబుతుంది అమ్మవారు. నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేచిన కాళహస్తిరాజు ఆనందబాష్పాలు కారుస్తాడు. తన విజయంలో అంతటి రహస్యం దాగుందని అర్ధం చేసుకొని హుటాహుటిన మందిమార్భలంతో కాళహస్తి ఆలయానికి వెళ్లి అమ్మకు బంగారు చీరను సమర్పిస్తాడు. ఆ చీరను అమ్మవారికి అలంకరిస్తారు పూజారులు. ఇది కేవలం ఓ కథ అనుకుంటే పొరపాటే. పూర్వం రోజుల్లో కాళహస్తిలో జరిగిన నిజమైన సంఘటన. ఈ సంఘటనను ఆలయంలోని శాసనంలో నేటికి మనం చూడవచ్చు. రాజు సమర్పించిన బంగారు చీరను ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరిస్తారు. బంగారు వర్ణంలో అమ్మవారు మెరిసిపోతుంటారు. శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కాళహస్తి ఆలయానికి తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకొని తన్మయత్వంతో పులకించిపోతుంటారు.