భగవంతుని దృష్టిలో మనిషి పుట్టుక ఎందుకు?

Why Does God Allow Human Birth? The Spiritual Truth Revealed

పునరపి జననం పునరపి మరణం అంటోంది గీత. మనిషి చేసిన కర్మలను అనుసరించి మళ్లీ మళ్లీ ప్రాణులుగా జన్మిస్తూ పాప కర్మలను చేస్తూ కర్మబంధాల నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నిస్తుంది. చేసిన పాప కర్మలు పూర్తయి మంచి కర్మలను చేయడం ఆరంభించిన తరువాత మనకు తెలియకుండానే మన మనసు భగవంతునివైపుకు మరలుతుంది. భగవంతుడిని చేరుకోవాలనే కోరిక పెరుగుతుంది. భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతకడం ప్రారంభిస్తాం. ఈ అన్వేషణ మనిషిని మహనీయుడిగా మారుస్తుంది.

దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవలసింది రమణ మహర్షి (Ramana Maharshi) గురించే. బాల్యం ఆయన ఆడిన ఆటలు, తీసుకున్న ఆహారాన్ని చూస్తే అందరికీ ఆశ్చర్యమేస్తుంది. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో ఓ సన్యాసి చెప్పిన మాటలతో మనసులో మార్పులు వస్తాయి. అక్కడి నుంచి ఆయన పయనం అరుణాచలం వైపుకు పడుతుంది. ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు పూర్తయి… ఈ జన్మలో రమణ మహర్షి పూర్తిగా మంచి కర్మలవైపుకు అడుగులు వేస్తాడు. సాక్షాత్తు ఆయన్ను సుబ్రహ్మణ్యుడి అవతారంగా చెబుతారంటే అర్ధం చేసుకోవచ్చు.

మనం కూడా ఇలా కాగలమా అంటే సందేహం లేదు. మన కర్మ ఫలితాలను అనుసరించి మనం ఈ జన్మలో కాకపోయిన వేరే ఏదోఒక జన్మలో మోక్షాన్ని పొందవచ్చు. కానీ, దానికి ఇప్పటి నుంచే సాధన మొదలుపెట్టాలి. ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుంది అంటే దానికో అర్ధం ఉండే ఉంటుంది. ఆ అర్ధాన్ని ముందు తెలుసుకోవాలి. కర్మలు, మోక్షం గురించి తెలుసుకునే ముందు అసలు భగవంతుని దృష్టిలో మనిషి జన్మించడం అంటే ఏమిటి? దీనివెనుకనున్న ఆధ్యాత్మిక భావన ఏమిటి? హిందూ ధర్మం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాల ప్రకారం మనిషి జన్మ స్వల్పకాలమే. ఈ స్వల్పకాలంలో భగవంతుని చేరుకునే మార్గాలను అన్వేషించాలి. కానీ, మనం ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?

భగవంతుని దృష్టిలో మనిషి ఎందుకు జన్మిస్తాడు?

కర్మ ఫలితంగా

మనిషి పూర్వజన్మలో చేసిన కర్మల ప్రకారం ఈ జన్మ ఏర్పడుతుంది. మంచి కర్మలకు ఫలితం మంచి జీవితం… చెడు కర్మలకు బాధలతో కూడిన జీవితం ఉంటుంది. భగవంతుడు ఈ కర్మ చక్రాన్ని న్యాయంగా నడిపించే సాక్షిగా మాత్రమే ఉంటాడు.

ఆత్మోన్నతికి అవకాశం

మనుష్య జన్మ అనేది మోక్షాన్ని పొందే అరుదైన అవకాశం. దేవతలు కూడా ఈ జన్మను కోరుతారు, ఎందుకంటే ఇది శాస్త్రాలు అధ్యయనం చేయడానికి, ధ్యానం, భక్తి, సేవల ద్వారా భగవంతుని చేరే మార్గం. కానీ మనం మనిషి జన్మను ఎత్తి ఏం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.

భగవంతుని అనుగ్రహం పొందేందుకు

ఈ జన్మలో భగవంతుని గురించి తెలుసుకునే, ఆయనకు భక్తితో జీవించేందుకు మనకు అవకాశం ఉంటుంది. భక్తి మార్గం ద్వారా భగవంతుని సన్నిధికి చేరడం ఈ జీవితం లక్ష్యం. బాల్యం నుంచే భక్తికి పునాది ఏర్పడాలి. కానీ, బాల్యంలో పుస్తకాలతోనూ, యవ్వనంలో ఉద్యోగంతోనూ, మధ్యవయసులో భార్యపిల్లలతోనూ సమయాన్ని వెచ్చించి… వార్ధక్యం వచ్చే సమయానికి కృష్ణారామా అని తలచుకుంటే ఏం ఉపయోగం. ఆ వయసులోనూ బాహ్యా, అంతరంగిక జీవితం బంధాలను బంధుత్వాలనే కోరుకుంటుంది.

ధర్మ నిర్వహణ కోసం

ప్రతి వ్యక్తి ధర్మబద్ధంగా జీవించి సమాజాన్ని, కుటుంబాన్ని, ప్రపంచానికి మేలు చేస్తూ ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించాలి. ఇది కూడా భగవంతుని ఆదేశమే. కానీ, ఈ ఆదేశాలను ఎంతమంది పాటిస్తున్నారు. కోటిమందిలో ఒక్కరైనా చెప్పుకున్న విధంగా పాటిస్తున్నారా? నిశ్వార్ధంగా సేవ చేస్తున్నారా?

చివరగా

మనిషి జన్మ భగవంతుని దయ వల్ల కలిగిన మహాప్రదానం. దీనిని ధర్మపథంలో నడిచే సాధనగా వాడుకుంటే మనం కర్మబంధాల నుండి విముక్తి పొందగలము. ఈ విధంగా భగవంతుని దృష్టిలో మనిషి జన్మ పునీతమైనదిగా మారుతుంది. జన్మలన్నింటిలోకి మనిషి జన్మ ఉత్తమమైనది. కర్మల నుంచి విముక్తి పొందేందుకు మనిషి ఈ జన్మను పొందుతాడు. ఈ జన్మలోనైనా సుకర్మలు చేసి పునీతులు కావాలని కోరుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *