మోహన్లాల్ … ఈ మలయాళం సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు… మొన్నే కదా ఆయనకి అత్యుత్తమ అవార్డు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటించారు. ఐతే, అప్పటి నుంచి ఎక్కడ చూసినా మోహన్ లాల్ కి సంబందించిన వార్తలే కనబడుతున్నాయి. అయన సినిమాల్లోకి వచ్చి ఎన్ని ఏళ్ళు అయ్యింది, అయన ఫస్ట్ సినిమా ఏంటి అని రకరకాల ఆర్టికల్స్…
ఐతే ప్రస్తుతానికి ఈ సూపర్ స్టార్ చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్నాడు… ఎంతగా అంటే 10 నెలల్లో 5 సినిమాలు రిలీజ్ చేసేటంత…
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా… సినిమా ప్రేమికులందరికీ ఎంతో ఆసక్తిని రేకెత్తించిన మలయాళీ బ్లాక్బస్టర్ సిరీస్ దృశ్యం మూడో భాగం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. దర్శకుడు జీతూ జోసెఫ్ మళ్లీ ఒకసారి జార్జ్ కుట్టి జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈసారి కూడా మోహన్లాల్ తన సహజమైన నటనతో మిలియన్ల హృదయాలను గెలుచుకోబోతున్నాడు.
మోహన్ లాల్ కూడా దృశ్యం 3 లాంచ్ ఈవెంట్ పిక్స్ తన ట్విట్టర్ తో షేర్ చేసారు… మీరు చూసేయండి:
ఇక మోహన్లాల్ కెరీర్ విషయానికి వస్తే… ఈ ఏడాదంతా ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. 2024 డిసెంబర్ 25న విడుదలైన ‘బరోజ్’ తర్వాత, ఈ ఏడాది ‘ఎంపురాన్’, ‘తుదరుం’, ‘హృదయపూర్వం’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. వాటిలో ‘ఎంపురాన్’, ‘తుదరుం’ అంచనాలకు మించిన విజయాన్ని సాధించగా, ‘హృదయపూర్వం’ మాత్రం నిరాశపరిచింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హై వోల్టేజ్ ప్రాజెక్ట్ ‘దృశ్యం త్రీ’ చేరింది.
ఇంతకుముందే ‘వృషభ’ అనే మరో పెద్ద సినిమాను దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అలా చూస్తే, 10 నెలల వ్యవధిలో ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంటే ఒక స్టార్ హీరోకే కాదు, ఏ నటుడికైనా అసాధ్యమే. కానీ మోహన్లాల్ తన 60 ఏళ్ల వయసులోనూ రాత్రింబవళ్లు కష్టపడి అభిమానులను అలరిస్తున్నారు.
జీతూ జోసెఫ్ గురించి చెప్పుకుంటే.. సాధారణంగా ఆయన సినిమాలను చాలా తక్కువ టైమ్లో పూర్తిచేస్తారు. దృశ్యం 3 కూడా మూడున్నర నెలల్లో పూర్తి అయ్యే అవకాశముంది. అందువల్ల వచ్చే ఏడాది మొదటి భాగంలోనే జార్జ్ కుట్టి మరోసారి థియేటర్లలోకి అడుగుపెట్టే అవకాశం బలంగా కనిపిస్తోంది.
ఇటీవలే భారత ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడిన మోహన్లాల్, ఇప్పుడు మరింత ఉత్సాహంతో తన కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే – లలేట్టన్ ఎక్కడ ఆగరు… అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందిస్తూనే ఉంటారు.