ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 కోట్ల మందికి భీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మిళిత మోడల్లో అమలుకానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు లాభం చేకూరబోతున్నట్టు కథనాలు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను అమలుచేయబోతున్నారు. అయితే, ఈ కవరేజ్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద ఇప్పటికే లాభం పొందుతున్న ఉద్యోగులను మినహాయించి మిగతా అందరికీ కూడా ఈ స్కీమ్ను అమలుచేయబోతున్నారు.
ఈ స్కీమ్ద్వారా ఏడాదికి రూ. 25 లక్షల వరకు ఆరోగ్యభీమా సౌకర్యం లభించబోతున్నది. ఇసన్సూరెన్స్ కంపెనీలు రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆరోగ్యభీమాను అందిస్తే, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మరో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు బీపీఎల్ కుటుంబాలకు వైద్యభరోసా కల్పించనున్నాయి. మొత్తం 3,257 వైద్యసేవలు ఈ స్కీమ్ ద్వారా అమలు కానున్నాయి. ఆసుపత్రిలో రోగిన చేర్చిన అరగంటలోపే వారికి సంబంధించిన స్కీమ్ ఆమోదం పొందుతుంది. ఈ స్కీమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎన్టీఆర్ ట్రస్ట్లో ఏర్పాటు చేస్తున్నారు. పేదవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం చేయించుకునేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.