- పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు
- ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ మనోహర్ గారితో కలసి కొండకు వచ్చారు.
ఆలయానికి విచ్చేసిన సందర్భంలో తొలుత పవన్ కళ్యాణ్ కు ఛైర్మన్ శ్రీ రాజబహదూర్ నివృతరావు, ఈఓ శ్రీ వి.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు శాసన సభలో ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మడి నాయకర్, ఎమ్మెల్యేలు శ్రీ మద్దిపాటి వెంకట రాజు, శ్రీ చిర్రి బాలరాజు, శ్రీ బడేటి రాధాకృష్ణ, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీ చాగంటి మురళీ కృష్ణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
పొంగుటూరు – లక్కవరం రోడ్డు పరిశీలన – 6.5 కిమీ రోడ్డు… రూ.1.5 కోట్లతో నిర్మాణం:
ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మరమ్మతులు చేపట్టిన పొంగుటూరు – లక్కవరం రోడ్డును పరిశీలించారు. గత ఏడాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ రహదారి పూర్తిగా గుంతలతో నిండి ఉంది. ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయించారు. పొంగుటూరు నుంచి లక్కవరం మధ్య 6.5 కిలోమీటర్ల, రూ. 1.5 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావడంతో పర్యటనలో భాగంగా రాజవరం వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ గారితో కలసి రోడ్డును పరిశీలించారు.