దేశంలో ఓటింగ్ సరళి ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని, అధికారంలో ఉన్న పాలకులు తమ అధికారాలను ఉపయోగించుకొని ఓటును తమకు అనుకూలంగా బదలాయించుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె ఈరోజు ట్విట్టర్లో వీడియో, టెక్ట్స్ రూపంలో చేసిన వ్యాఖ్యలను యధాతథంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. షర్మిల ఏమన్నారో మీరే చూడండి.
దేశ ప్రజల ఓటు హక్కు కాపాడటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మన నాయకులను మనం ఎన్నుకొనే స్వేచ్ఛ ఇచ్చింది. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ECI నిర్వహించాలి. కానీ ఎన్నికలసంఘం ప్రధాని మోడీ గారి చేతిలో బంది అయ్యింది. CBI, ED, INCOME TAX, RBI, స్టాక్ ఎక్స్ఛేంజ్ లాంటి అన్ని వ్యవస్థలు మోడీ
@narendramodi గారి గుప్పెట్లో బీజేపీ కోసం పని చేస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పనిచేస్తుంది.ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టారు. ఇది పచ్చి నిజం. ఇది మన భారత దేశ ప్రజాస్వామ్య యదార్ధత అని రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు ECI బండారాన్ని బయట పెట్టారు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజక వర్గాన్ని ఒక శాంపిల్ గా తీసుకున్నారు. ఒక లక్ష దొంగ ఓట్లను నమోదు చేశారు. అన్ని దొంగ ఫొటోలు, దొంగ పేర్లు, దొంగ అడ్రస్ లు. అంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా కొత్త ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లు ఎవరు వేశారు ? CCTV ఫుటేజ్ ఎక్కడ ఉంది ? అంటే ECI దగ్గర ఏ ఆధారాలు లేవు. అలాగే 5 ఏళ్లలో కంటే కూడా ఎన్నికలకు 5 నెలల ముందు కోటి ఓట్లకు పైగా కొత్త ఓట్లు నమోదు అయ్యాయి. ఇది అన్యాయం కాదా ? ఓట్ చోరీ కోసం ఇదంతా చేయలేదా ? ఎన్నికల సంఘం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లను తొలగించింది. బీజేపీకి అనుకూలంగా దొంగ ఓట్లను నమోదు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఓట్ చోరీపై దేశ వ్యాప్త పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ
@RahulGandhi గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటాన్ని ఎత్తుకున్నాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలి. మీ సంతకం కూడా కావాలి. నేటి నుంచి అక్టోబర్ 15 వరకు కాంగ్రెస్ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలిపి, మాతో కలిసి పోరాటం చేయాలని రాష్ట్ర ప్రజలకు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా.