కాసర్గోడ్ జిల్లా పాద్రె గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది — కానీ అది సాధారణ ఇల్లు కాదు. గత 75 ఏళ్లుగా ఆ ఇంట్లోనే పోస్టాఫీస్ పని చేస్తోంది! కాలం మారినా, సాంకేతికత పెరిగినా, ఆ ఇల్లు మాత్రం గ్రామానికి ఒక చరిత్రగా నిలిచిపోయింది. గోడలు పాడై పాతబడ్డా, కిటికీలు జారిపోతున్నా… ప్రజల మనసులో మాత్రం ఆ పోస్టాఫీస్ కొత్తదే.
పోస్ట్మాస్టర్ జగదీశ్ గత 24 ఏళ్లుగా అక్కడే సేవలందిస్తున్నారు. ఆయన చెబుతున్న మాటల్లో ఆ బంధం స్పష్టంగా తెలుస్తుంది — “ఈ ఇల్లు మా కుటుంబంలాంటిదే. ప్రతి ఉదయం తలుపు తెరుస్తే పాత జ్ఞాపకాలు ముందుకు వస్తాయి.”
గ్రామంలో సుమారు 350 కుటుంబాలు ఈ పోస్టాఫీస్ ద్వారా 200 రకాల పోస్టల్ సేవలను పొందుతున్నారు. మనీ ఆర్డర్లు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్ చెల్లింపులు — అన్నీ ఈ చిన్న గదుల్లోనే జరుగుతాయి. పాతకాలపు బల్లలు, గడియారం, లేఖల సంచులు — ఇవన్నీ గత కాలపు పోస్టల్ గౌరవాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఇటీవల పోస్టల్ శాఖ ఈ కార్యాలయాన్ని కొత్త భవనానికి మార్చాలన్న నిర్ణయం తీసుకుంది. కానీ గ్రామస్తులు ఒక్కసారిగా తిరస్కరించారు. “ఈ ఇల్లు మా జ్ఞాపకాలు, మా చరిత్ర. ఇక్కడే పోస్టాఫీస్ ఉండాలి” అంటూ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఆ భవనానికి నెలకు కేవలం రూ.250 అద్దె మాత్రమే చెల్లిస్తున్నప్పటికీ, గ్రామస్థుల హృదయాల్లో దాని విలువ అమూల్యం.