బీహార్లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీయే కూటమి హవా కొనసాగుతూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫలితాలను సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటేసి 175 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుండగా.. మహాగట్బంధన్ కూటమి కేవలం 64 స్థానాల్లో మాత్రమే తన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీహార్లో అధికారంలోకి రావాలంటే 122 స్థానాల్లో విజయం సాధించాలి.
మహాకూటమి ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలి అంటే ఇంకా 60 స్థానాలను గెలుచుకోవాలి. కానీ, తాజా ట్రెండ్స్ ప్రకారం ఎంజీబీ మరో పది స్థానాలను గెలుచుకుంటే చాలని అనే విధంగా ఫలితాలు ఉంటున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కారు వైపే ప్రజలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయులు సమానంగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయే బీహార్ సీఎం అభ్యర్థి నితీష్ కుమారే అని ముందుగానే ప్రకటించి ఎన్నికలు వెళ్లడంతో పాటు, కేంద్రం నుంచి పలు రకాలైన అభివృద్ధి నిధులు బీహార్కు అందడం, బీహార్లోని మహిళల ఖాతాల్లో పథకం పేరుతో 10వేల రూపాయలను జమ కావడం, రైతులకు, సామాన్యులకు ప్రోత్సాహం అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడంతో ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఓట్ల లెక్కింపుకు ముందు ఎంజీబీ ఈవీఎంలు మ్యానిప్యులేషన్కు గురి అవుతున్నాయని, ఓట్లు లెక్కింపు మిషన్లను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. కానీ, అధికారులు తాము తీసుకొచ్చిన బాక్సులు ఖాళీగా ఉన్నాయని ఎంజీబీ నాయకులకు చూపించినా వారు అదేవిధమైన ధోరణిలో ఉండటం విశేషం. అంతేకాకుండా, ఢిల్లీ పేలుళ్ల అంశాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం వారికి కొంత ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం వరకు తుదిఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయం ఎన్డీయేదే అయినా… ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది అన్నది మరికాసేపట్లో తేలిపోతుంది.