జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో నెయ్యి సృష్టి – ఆ సింథటిక్ నెయ్యి తిరుమలకు సరఫరా:
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు ఆవులు లేవు. కనీసం పాలుగానీ, వెన్నగానీ కూడా ఎక్కడా సేకరించిన దాఖలాలు. అయినా నెయ్యి సరఫరా చేసేశారు. అదీ 60 లక్షల కిలోలు. నువ్వుల నూనె కంటే కారు చౌకగా నెయ్యి సరఫరా చేశారు. అంటే ప్రతి చుక్కా కల్తీయే. ఆవు… పాలు… వెన్న లేకుండా నెయ్యిని సృష్టించడం శాస్త్రవేత్తల వల్ల కూడా సాధ్యం కాదు. కేవలం వైసీపీ వాళ్ళకే సాధ్యం.
భక్తులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేని నూటికి నూరు శాతం వాస్తవం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరఫరా అయిన 60 లక్షల కిలోల ఆవు నెయ్యిలో ప్రతి చుక్కా కల్తీయే. రసాయనాలతో సృష్టించిన ద్రవాన్నే నెయ్యిగా చూపించి – ఆ రసాయనాలు నిండిన ద్రావకంతో 20 కోట్ల లడ్డూలు చేసి ప్రసాదంగా విక్రయించారు. ఈ కఠోర వాస్తవాలను సి.బి.ఐ. నివేదిక స్పష్టంగా చెబుతోంది. జంతు కొవ్వు లేదు అని ఆ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు. అసలు ఆ రసాయనాల పుట్టుకే జంతు కొవ్వు నుంచి అని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని అందరూ గమనించాలి. అంటే జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో సింథటిక్ నెయ్యి తయారు చేసి ఆ ద్రవాన్నే తిరుమలకు సరఫరా చేశారు.
ఇన్ని వాస్తవాలు ప్రస్ఫుటంగా ఉన్నా, ఘోర అపచారం చేసి కూడా వైసీపీ పాపాల భైరవులు తమకు క్లీన్ చిట్ వచ్చిందంటూ ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యం. కల్తీ నెయ్యి కొనుగోలుకు ద్వారాలు తెరిచి రూ.233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకున్నది వైసీపీ వాళ్లే.
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని తెలియగానే ప్రతి ఒక్క భక్తుడూ మనో వేదనకు లోనయ్యాడు. స్వామివారి ఆలయానికి ధర్మకర్తలుగా ఉండాల్సినవాళ్ళు నీతిబాహ్యమైన చర్యలకు ఒడిగట్టడం అత్యంత హేయం. ఎన్.డి.డి.బి. ఇచ్చిన నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయాన్ని వెల్లడించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి భక్త కోటిని కదిలించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్ఘాటించారు.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై చర్చించే సమయం ఆసన్నమైనది. తిరుమల లడ్డూ తయారీకి అవసరమైన ఆవు నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు కలిపి అపచారానికి పాల్పడ్డ వైసీపీ నీచత్వాన్ని… నెయ్యి కుంభకోణంలో రూ.233 కోట్లు దోచేయడాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేసేలా శాసన సభలో చర్చించాలని… ప్రజలకు తెలియజేసేందుకు జనసేన సన్నద్ధం కావాలని తీర్మానిస్తున్నాము.