ఏపీ లోని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంఆర్ టౌన్ షిప్ లోని అపార్ట్మెంట్స్ లో భారీ
చోరీలు జరిగాయి. రెండు ప్రాంతాలను విజయనగరం జిల్లా ఎస్పీ సోమవారం సందర్శించి, నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు కేసులను చేధించేందుకు అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ – గత రాత్రి GMR టౌన్ షిప్ లోని లాక్ వేసి ఉన్న రెండు ఇండ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి, ఐరన్ అల్మరాలను తెరిచి, ఒక ఇంటిలో 125 తులాలు, మరో ఇంటిలో 25 తులాల బంగారు ఆభరణాలను దొంగలించారన్నారు. నేర స్థలాలను ఇప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లు పరిశీలించాయని, ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించామన్నారు. ప్రాథమిక విచారణలో ముగ్గురు నిందితులు నేరాలకు పాల్పడినట్లుగా సీసీటీవీ ఫుటేజిలో గుర్తించామని, వీరికి ఎవరైనా సహకరించారా? ఏదైనా గ్యాంగులు ఈ నేరానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ నేరాలను చేధించేందుకు CCS పోలీసులను, నేరాలను చేధించుటలో నిష్ణాతులైన ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని రాజాం రప్పించామన్నారు. వీరితో 10 బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుండి కొంతమంది వ్యక్తులు పనులు కోసం వచ్చినట్లు, వారికి ఏమైనా ఈ నేరంతో ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ విచారణ చేపడతామన్నారు. నేరాలను చేధించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సమీపంలోని సీసీ ఫుటేజులను పరిశీలించి, నేరం జరిగిన తీరుపై ఒక అంచనాకు వస్తామన్నారు. నేర స్థలంలో లభించిన ఆధారాలను మరింత అభివృద్ధి చేసి, టవర్ డంప్ పరిశీలించి కేసు మిస్టరీలను త్వరలో చేధిస్తామనీ జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితులను అధైర్య పడవద్దని, కేసుల్లో పురోగతిని సాధించి, న్యాయం చేస్తామని బాధితులకు జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో పని చేస్తాయని, బృందాలను సిఐ లేదా ఎస్ఐ నాయకత్వం వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

ఈ తరహా నేరాలకు పాల్పడే MO క్రిమినల్స్ ను, అనుమానాస్పద వ్యక్తులను విచారణ చేయాలని, సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాల సహకారాన్ని తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ ఆదేశించారు.
ఇంటిలో విలువైన వస్తువులను ఉంచుకోవద్దని, బంగారంను బ్యాంకు లాకర్లులో దాచుకోవాలని, సమాచారాన్ని నివాస ప్రాంతాలకు దగ్గర ఉండే స్థానికులు, వాచ్మెన్స్ తో పంచుకోవడం చేయవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ వెంట చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం సిఐ అశోక్ కుమార్, రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర, ఇతర పోలీసు అధికారులు, సిసిఎస్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.