•ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
•జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించనున్న ఉప ముఖ్యమంత్రి
•ఇల్లు మంజూరుకు ఆదేశం.. చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత
పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.
తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున…
ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.