హైకోర్టు ఇచ్చిన పరువు తీర్పు… బాబాయ్‌కి బెయిలు

Pranay Honor Killing Case Telangana High Court Grants Bail to Amrutha’s Uncle Shravan Kumar

మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ పరువు హత్య కేసులో, గతంలో ట్రయల్ కోర్టు శ్రవణ్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన హైకోర్టు, శ్రవణ్ కుమార్ వయస్సు, ఇప్పటివరకు జైలులో గడిపిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్‌కు కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు సమాచారం. కోర్టు నిర్ణయంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

పరువు హత్య వంటి అత్యంత క్రూరమైన నేరంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఎలా మంజూరు చేస్తారన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే కఠిన నిర్ణయాలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, చట్ట ప్రకారం అప్పీల్ హక్కు ప్రతి నిందితుడికీ ఉంటుందని, విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వడం న్యాయ ప్రక్రియలో భాగమేనని న్యాయవర్గాలు వివరిస్తున్నాయి. హైకోర్టు తీర్పుతో ప్రణయ్ పరువు హత్య కేసు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *