భారతదేశంలో పాకిస్తాన్‌ గ్రామం

భారత్‌ పాకిస్తాన్‌ మధ్య ప్రస్తుతం ఏ స్థాయిలో పరిణామాలు చోటు చేసుకున్నాయో చెప్పక్కర్లేదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించాలనే డిమాండ్‌ రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రధాని మోడీ ఈ విషయంలో స్పష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ అంటే ముస్లింల దేశం. భారత్‌ నుంచి విడిపోయిన దేశం. భారత్‌నుంచి పాకిస్తాన్‌ విడిపోయినా…మనదేశంలో మరో పాకిస్తాన్‌ ఉంది. అది ఓ చిన్న గ్రామం. ఈ గ్రామం బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఉండటం విశేషం. 1947కి ముందు బీహార్‌లోని పూర్ణియా జిల్లా నేపాల్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. అయితే, పూర్ణియా జిల్లాలోని ఇప్పుడు పాకిస్తాన్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో ఎక్కువగా ముస్లింలు నివశించేవారు.

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం రావడం, భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోవడంతో కొంతమంది సానుభూతిపరులు ఈ గ్రామానికి పాకిస్తాన్‌ అనే పేరు పెట్టారు. పూర్ణియా జిల్లా తూర్పు పాకిస్తాన్‌కు సమీపంలో ఉండటంతో ఇక్కడి గ్రామానికి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే, 1971లో తూర్పు పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని పాకిస్తాన్‌ గ్రామంలో నివశించే ముస్లింలు ఈ ప్రాంతాన్ని వదిలి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ గ్రామంలో నివశిస్తున్నది దేశంలోనే అతిపెద్ద తెగగా చెప్పుకునే సంతాల్‌ తెగ ప్రజలు. ఈ గ్రామంలో మొత్తం జనాభా 300 మంది వరకు ఉన్నారు. ఇక్కడి నుంచి ముస్లింలు వెళ్లిపోయే సమయంలో తమ ఆస్తులను సంతాల్‌ తెగలకు అప్పగించి వెళ్లిపోయారు. అప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో గ్రామం పేరు పాకిస్తాన్‌గా నమోదు కావడంతో ఇప్పటికీ ఆ పేరు అలాగే ఉండిపోయింది. ఈ గ్రామంలో సంతాల్‌ తెగ ప్రజలు తప్పించి ఒక్క ముస్లిం వ్యక్తి కూడా లేడు. ఒక్క మసీదు కూడా లేదు. గిరిజన హిందూవులు నివశిస్తున్న ఈ గ్రామానికి పాకిస్తాన్‌ అనే పేరు ఉండటమే కొంత ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మారుమూల గ్రామం కావడం, అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా కావడంతో ఈ గ్రామం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడైనా నాయకులు, అధికారులు పట్టించుకొని గ్రామం పేరు మారిస్తే బాగుంటుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *