మన దేశంలో దేవాలయాలంటే భక్తి, సంప్రదాయం, ఆచారాల సమ్మేళనం. ఎక్కడికి వెళ్లినా దేవతలకు పండ్లు, పాయసం, కొబ్బరికాయలు, నైవేద్యాలు సమర్పించడం సహజం. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో వెలసిన “మా బాగ్దాయి” అమ్మవారి ఆలయంలో మాత్రం భక్తి ఒక విభిన్న రూపంలో దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రసాదంగా సమర్పించేది ఐదు రాళ్లు, ఒక పువ్వు మాత్రమే. ఇదే ఈ ఆలయ విశిష్టత… ఇదే ఆధ్యాత్మిక సందేశం.
దట్టమైన అడవుల మధ్య, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానికులు చెబుతారు. ఈ కథ ప్రారంభం ఒక సాధారణ గొర్రెల కాపరితో. జీవనోపాధి కోసం అడవుల్లో తిరుగుతూ గొర్రెలను మేపే ఆ వ్యక్తి, ఒకరోజు అక్కడ ఒక దివ్యశక్తిని అనుభవించాడు. కొద్ది సేపటికే అతనికి అమ్మవారి రూపం దర్శనమిచ్చింది. ఆ క్షణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది.
వార్ ఎఫెక్ట్ః క్రూడాయిల్ మాత్రమే కాదు…బంగారం కూడా తగ్గింది
ఆ రాత్రి అతనికి కలలో అమ్మవారు ప్రత్యక్షమై, “ఈ ప్రదేశంలోనే నన్ను ప్రతిష్టించు” అని ఆజ్ఞాపించిందని చెబుతారు. తన వద్ద ఉన్న కొద్దిపాటి సాధనాలతో అతను ఒక చిన్న గుడిని నిర్మించాడు. కానీ అతనికి ధనం లేదు. నైవేద్యం కోసం పండ్లు, కొబ్బరికాయలు కొనుగోలు చేసే స్థోమత లేదు. తన అసమర్థతను కన్నీళ్లతో అమ్మవారి ముందు విన్నవించుకున్నాడు.
అప్పుడు అమ్మవారు ఇచ్చిన సందేశమే ఈ ఆలయానికి ప్రాణం. “నాకు ఆడంబరాలు అవసరం లేదు. నీ నిజమైన భక్తి చాలు. ఈ అడవిలో ఉన్న ఐదు రాళ్లు తీసుకుని నాకు సమర్పించు” అని అమ్మవారు అన్నట్లు విశ్వసిస్తారు. ఆ రోజు నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. నేటికీ భక్తులు అదే విధంగా 5 రాళ్లు, 1 పువ్వు సమర్పిస్తూ తమ మొక్కులను కోరుకుంటున్నారు.
ఈ ఆలయంలో మొక్కు తీర్చుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకం. భక్తులు ముందుగా ఐదు రాళ్లు సమర్పించి తమ కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి మరోసారి అదే విధంగా సమర్పణ చేసి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి, చెడుదృష్టి దూరమవుతుంది అనే విశ్వాసం బలంగా ఉంది.
ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు సందర్భంగా ఇక్కడ 9 రోజుల పాటు విశేష ఉత్సవాలు జరుగుతాయి. అడవి మధ్యలో వేలాది మంది భక్తులు చేరి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సమయంలో ఆలయం సాదాసీదా అలంకరణలోనే ఒక ప్రత్యేక శోభను పొందుతుంది. ప్రకృతి మధ్యలో జరిగే ఈ వేడుక భక్తులకు ఆత్మశాంతిని, భక్తి పరవశాన్ని అందిస్తుంది.