మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు…

భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 1969లో ప్రారంభమైన ఈ అవార్డు, సినిమాకి జీవితాంతం సేవ చేసిన వారిని సత్కరించడానికి ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. ఎన్నో గొప్ప నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ అవార్డును అందుకొని తమ కృషికి గౌరవం పొందారు.

ఈసారి ఆ గౌరవం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు దక్కింది. భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ప్రకటించింది. ఈ నిర్ణయం జ్యూరీ సిఫార్సు మేరకు తీసుకున్నారు.

ఈ అవార్డు సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో మోహన్‌లాల్‌కు ప్రదానం చేయనున్నారు. సినీ ప్రముఖులు, అధికారులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ అవార్డు ఆయనకు అందజేస్తారు.

నలభై ఏళ్ళకుపైగా సాగుతున్న తన కెరీర్‌లో 350కి పైగా చిత్రాలలో నటించిన మోహన్‌లాల్ సహజమైన నటన, విభిన్నమైన పాత్రలలో మెప్పించే ప్రతిభతో గుర్తింపు పొందారు. కేవలం మలయాళం మాత్రమే కాకుండా, ఇతర భాషలలో కూడా నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు.

ఈ అవార్డు మోహన్‌లాల్ సినీ కృషికి అత్యున్నత గౌరవంగా భావిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అగ్రగణ్యుల సరసన ఆయన నిలిచినట్టే. అభిమానులకు, సినీ పరిశ్రమకూ ఇది ఒక గర్వకారణం. ఆయన చేసిన పనులు ఇంకా అనేక మందిని ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *