రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా తన శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో ముద్రించిన బుక్ లెట్ లను ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అందచేయడానికి సిద్ధం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనుల వివరాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాల వివరాలు, 15వ ఆర్ధిక సంఘం నిధులు ఎంత ఇచ్చాం అనే వివరాలకు పుస్తకరూపం కల్పించారు. అందుకు సంబంధించిన తొలి ప్రతిని గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి అందించారు. శుక్రవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ కి స్వయంగా వెళ్లి ఆయన నియోజకవర్గం పరిధిలో రూ. 312 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వివరిస్తూ బుక్ లెట్ అందజేశారు. పల్లెపండగ 1.0కి రూ. 36.21 కోట్లు, పల్లెపండగ 2.0 ద్వారా రూ. 58.85 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద రూ. 43.83 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు, 15వ ఆర్ధిక సంఘం నిధులు మరో రూ. 173.53 కోట్లు విడుదల చేసినట్టు తెలియజేశారు.