నవమికి ముందే రాములోరికి గిరి ప్రదక్షిణ సుమమాల

Pawan Kalyan Virtually Launches Ramateertham Giri Pradakshina Road Ahead of Sri Rama Navami

* రామతీర్థంలో నాటి వేదన బాధ.. నేడు అభివృద్ధి జాడతో తీరింది
* రూ. 3.40 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మాణం
* ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
* రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు వసతి కల్పించాం
* శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం
* ⁠కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశాం
* ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్ గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీమతి వంగలపూడి అనిత గారు, శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, శాసనసభ్యులు శ్రీమతి లోకం మాధవి గారు, శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రామతీర్థం ఒకటి. ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి. అంతటి పవిత్రత కలిగిన రామతీర్ధం కొండ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే ముక్తిని పొందుతారన్నది భక్తుల నమ్మిక. అందుకే వైకుంఠ ఏకాదశి, శివరాత్రి పర్వదినాల్లో బోదికొండగా పిలుచుకునే రామతీర్ధం గిరి చుట్టూ వేలాది మంది భక్తులు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారు.

* రాళ్లు, ముళ్ల కంపలతో భక్తులు ఇబ్బందిపడేవారు:
రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలతో నిండి ఉండేది. గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులు కష్టమైనా ఆ మార్గంలోనే నడిచేవారు. ఈ విషయాన్ని స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి లోకం మాధవి గారితోపాటు కొందరు భక్తులు నా దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రతను సంరక్షించే చర్యల్లో భాగంగా రామతీర్ధం కొండ చుట్టూ రోడ్డు నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 3.40 కోట్లు వెచ్చించి గిరిప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారంతో శ్రీరామ నవమికి రెండు రోజుల ముందే రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.

Image

* 20 నెలల్లో రూ. 40 కోట్లు వెచ్చించాం:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులు రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్ల సౌకర్యం కల్పించాం. శివరాత్రికి ముందు శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశాం. ఈ రోజున రాములవారి భక్తుల కోసం రామతీర్ధం గిరిప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తెచ్చాం.

– గత ప్రభుత్వ పాలనలో రాముల వారి విగ్రహానికి శిరచ్ఛేదం వేదన కలిగించింది:
గత ప్రభుత్వం హయాంలో ఇదే రామతీర్ధం పుణ్యక్షేత్రంలో రాములవారి విగ్రహం శిరచ్ఛేదం చేస్తే కోట్లాది మంది హిందువు భక్తులు బాధకి గురయ్యారు. వారిలో నేనూ ఒకడిని. ఆ ఘటన తీవ్ర వేదన కలిగించింది. ఈ రోజున ఆలయానికి గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుందరంగా నిర్మించడం ద్వారా స్వామిని ఈ రూపంలో సేవించుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. సంస్కృతి సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *