•రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చండి
•కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని శ్రీవైష్ణవ్ గారితో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు.

పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన విఖ్యాత క్షేత్రాలు పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. శ్రీ అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.