పుష్యమాసంలో వీటిని దానంగా ఇస్తే…ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

హిందూ ధర్మంలో పుష్యమాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం శుభశక్తులు అధికంగా ప్రసరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి. శనిభగవానుని జన్మ నక్షత్రం పుష్యమి కావడం వల్ల పుష్యమాసం ఆయనకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందుకే ఈ కాలంలో శనిదేవుని ఆరాధన చేస్తే శని దోషాలు, కష్టాలు తొలగి జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల నమ్మకం.

హేమంత ఋతువులో వచ్చే ఈ మాసం శరీరానికి, మనసుకు అనుకూలంగా ఉండటంతో జపాలు, తపస్సులు, ధ్యానం, వ్రతాలు చేయడానికి అత్యుత్తమ సమయంగా పరిగణిస్తారు. ‘పుష్య’ అనే పదానికి పోషణ, అభివృద్ధి అనే అర్థం ఉండటంతో ఈ మాసంలో ప్రకృతి సస్యశ్యామలంగా మారి పంటలు సమృద్ధిగా లభిస్తాయి. రైతులకు ఇది ఆనందకాలం.

పుష్యమాసంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. అలాగే షట్టిల ఏకాదశి, చొల్లంగి అమావాస్య వంటి వ్రతాలకు కూడా ఈ మాసంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు చేయడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

విష్ణు భగవానుడిని, సూర్యదేవుని పూజించడం ఈ మాసంలో విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రోక్తి. ముఖ్యంగా నువ్వులు, ధాన్యం, వస్త్రాలు, దుప్పట్లు వంటి దానాలు చేయడం ద్వారా అఖండ పుణ్యం లభించి, శని అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే పుష్యమాసం భక్తి, దానం, ఆధ్యాత్మిక సాధనలతో జీవితం శుభమయం చేసుకునే పవిత్ర కాలంగా గుర్తింపు పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *