సంచలన జ్యోతిష్కుడు వేణుస్వామి తెలుగు రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆయన జాతకంలో బలమైన రాజయోగం ఉందని వేణుస్వామి స్పష్టం చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను విశ్లేషిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
మఖ నక్షత్రం.. సీఎం యోగం!
గతంలో పవన్ కల్యాణ్ రాజకీయాలపై ప్రతికూల వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి, ఇప్పుడు తన రూట్ మార్చారు. ప్రస్తుతం పవన్ ఒక ‘పర్ఫెక్ట్ లీడర్’ అంటూ ప్రశంసించారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలే. ఎన్టీఆర్ ‘మఖ’ నక్షత్రంలో జన్మించారని, గతంలో తమిళనాడును శాసించిన జయలలిత కూడా ఇదే నక్షత్రంలో పుట్టారని ఆయన గుర్తు చేశారు. తారక్ ఎప్పటికైనా యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే తిరుగుండదని, ఆయనే కాబోయే సీఎం అని జోస్యం చెప్పారు.
వన్-లైనర్ పంచ్లు.. పొలిటికల్ హింట్లు
ఈ ఇంటర్వ్యూలో వేణుస్వామి ప్రముఖులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ముగ్గురూ దైవాంశ సంభూతులని కొనియాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ‘తెలంగాణ తోపు’ అని, కేసీఆర్ను ‘జాతిపిత’ అని అభివర్ణించారు. చంద్రబాబును ‘గ్రేట్ అడ్మినిస్ట్రేటర్’గా, వైఎస్సార్ను ‘క్షమాగుణం ఉన్న నేత’గా పేర్కొన్నారు. చివరగా, తన సొంత రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తనకు, తన భార్యకు రెండు ఆప్షన్లు ఉన్నాయని హింట్ ఇచ్చారు. అయితే, తనకు కింగ్ కావడం కంటే ‘కింగ్ మేకర్’గా ఉండటమే ఇష్టమని చెప్పారు. భారతదేశంలో త్వరలోనే ఎవరూ ఊహించని మూడు నుంచి నాలుగు పెను సంచలనాలు జరగబోతున్నాయంటూ వేణుస్వామి ముగించడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.