కాంతార సినిమాతో సంచలనం సృష్టించిన జాతీయ అవార్డు గ్రహీత, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు 3 భారీ ప్రాజెక్టులతో అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను ‘కాంతార: చాప్టర్ 2’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని, దీంతో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టినట్లు ఆయన ప్రకటించారు.
ఒకేసారి రెండు పెద్ద సినిమాలు
దర్శకత్వంపై తనకున్న అమితమైన ఇష్టాన్ని వివరిస్తూ, రచయితల బృందంతో కలిసి ‘కాంతార 2’ పనులను వేగవంతం చేసినట్లు రిషబ్ స్పష్టం చేశారు. అయితే, నటుడిగా ఒకేసారి రెండు భారీ చిత్రాల షూటింగ్స్ చేయడం సాధ్యం కాదన్న ఆయన.. తన తదుపరి చిత్రాల ప్రణాళికను వివరించారు. మొదట ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోతున్న ‘జై హనుమాన్’ షూటింగ్ను పూర్తి చేస్తానని, ఆ తర్వాతే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సెట్స్పైకి వెళ్తుందని స్పష్టత ఇచ్చారు. ఈ రెండు చిత్రాల కోసం పూర్తిగా భిన్నమైన గెటప్స్లో కనిపించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
వివేక్ ఒబెరాయ్ ట్వీట్ వైరల్
ఇక ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సోషల్ మీడియా వేదికగా రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. “రిషబ్ శెట్టి సినిమా ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే పోర్టల్ లాంటిది. మట్టి, నిప్పు, హద్దులు దాటిన విజన్తో సినిమా రూల్స్నే మార్చేసిన మాస్టర్ క్రాఫ్ట్స్మన్కు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ వివేక్ ప్రశంసలు కురిపించారు. రిషబ్ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.