ఇరాన్తో కుదిరిన అవగాహన ఒప్పందం (Memorandum of Understanding) ఇక ముగిసిపోయిందని, ఆ దేశంతో చర్చలు జరపడం కేవలం కాలయాపనేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం టర్కీలో నాటో (NATO) చీఫ్ మార్క్ రూటెతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గడిచిన రాత్రి ఇరాన్లోని అత్యంత ప్రమాదకరమైన స్థావరాలపై అమెరికా సైన్యం ఒకసారి అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించిందని ఆయన అధికారికంగా ధృవీకరించారు.
ఇరాన్ ఒక క్యాన్సర్.. ముందే కట్ చేయాలి!
ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్ పాలకులపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. “గత రాత్రి మేము ఇరాన్లోని ప్రమాదకరమైన శక్తులపై తీవ్రమైన దాడి చేశాం. ఆ దేశ పాలకులకు ఏదో మైండ్ పాడైంది. వారు పరమ దుర్మార్గులు, అబద్ధాలకోరులు. వారు అణుబాంబు తయారు చేయాలని చూస్తున్నారు. నా దృష్టిలో వారితో మాట్లాడటం సమయం వృధా. ఇకపై వారితో ఎలాంటి చర్చలు ఉండవు, అంతా ముగిసిపోయింది” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ శక్తులను సమాజానికి పట్టిన ‘క్యాన్సర్’తో పోల్చిన ట్రంప్.. ఆ క్యాన్సర్ను ముందే కట్ చేసి పారేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి ఈ దూకుడు ప్రకటనతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. ఇరాన్పై అమెరికా మరింత పెద్ద ఎత్తున సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయి.