తిరుమల శ్రీవేంకటేశ్వరుని (Tirumala Sri Venkateswara) పేరు తెలియనివారుండరు. స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటుంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన వాటిల్లో తిరుమల కూడా ఒకటి. హైందవ ధర్మాన్ని ఆచరించే వారికి 108 దివ్య ధామాల్లో తిరుమల కూడా ఒకటి. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులార దర్శించుకునేందుకు మనమంతా తహతహలాడుతుంటాం. లిప్తపాటు క్షణమైనా ఆ స్వామిని చూస్తే చాలని అనుకుంటాం. పెద్ద ఎత్తున క్యూ, తోపులాటల మధ్య స్వామివారి పూర్తి దివ్య మంగళ స్వరూపాన్ని చూడలేము. మమ అనుకొని బయటకు వచ్చేస్తాం.
అరె ఇంత ఖర్చుపెట్టుకొని వెళ్లాం కదా. కనీసం స్వామివారి రూపాన్ని కన్నులారా దర్శించలేకపోయామే అనే ఒక భావన మనలో కలుగుతుంది. ఈ భావన నుంచి బయటకు వచ్చేందుకు ఆ స్వామివారే విమాన వేంకటేశ్వర స్వామి (Vimana Venkateswara Swamy) రూపంలో ఏర్పాటు చేశారు. గర్భాలయంలో వేంకటేశ్వరుడు ఎలా ఉంటాడో… అచ్చుగుద్దినట్టుగా అదేవిధంగా నకలుగా గర్భాలయం గోపురంపైన వాయువ్య మూలన, ఉత్తరాభిముఖంగా భక్తులకు దర్శనం ఇస్తారు. గర్భగుడిలో స్వామిని కన్నులారా దర్శించుకోలేకపోయినా… బయట గోపురంపై స్వామిని దర్శించుకొని సంతోషిస్తాం.
ఆలయ గోపురంపై ఉన్నది స్వామివారి నకలు రూపమే. అయితే ఈయన్నే విమాన వేంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కానీ, అసలు విమాన వేంకటేశ్వర స్వామి విగ్రహం అదికాదని అంటారు. వైకుంఠం నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు (Srimaha Vishnu) విమానంలో తిరుమల కొండమీదకు వచ్చారని, ఆ సమయంలోనే తొండమాన్ చక్రవర్తి (Tondaman Chakravarthy)శ్రీనివాసుడికి దేవాలయాన్ని నిర్మించారని అంటారు. తొండమాన్ చక్రవర్తి దేవాలయాన్ని నిర్మించే సమయంలో స్వామివారు వచ్చిన ఆలయం యధాతథంగా ఉంచారని, స్వామివారి విగ్రహాన్ని కూడా విమానంలో ఉంచారని, కానీ, ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది.
ఆ తరువాత మరోసారి తిరుమల ఆలయాన్ని నిర్మించారు. తిరుమల ఆలయం కాలగర్భంలో కలిసిపోయిన తరువాత క్రీ.పూర్వం 3వ శతాబ్దంలో లభ్యమయిన తమిళసాహిత్యం తిరువేంగడం అనే గ్రంధంలో తిరుమల గురించిన వివరాలను పొందుపరిచారు. అందులో సూర్యచంద్రులు ఆరాధిస్తుండగా పద్మపీఠంపై స్వామివారు నిలబడి ఉన్నారని చెప్పబడింది. తిరుమలలో పెద్దగా గుడి ఏమి లేదని, ఆరుబయటే చిన్న గుడి ఉందని తిరువేంగడంలో పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం మనం తిరుమలలో చూస్తున్న గర్భగుడి 9వ శతాబ్దంలో నిర్మించబడిందని తెలుస్తోంది. అయితే, ఈ దేవాలయంలోని స్వామివారు స్వయంభూవుగా వెలిసినట్టుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. అయితే, క్రీపూ 3వ శతాబ్దానికి పూర్వం ఉన్న దేవాలయంలో సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగొచ్చిన నారాయణుడి విగ్రహం, ఇప్పుడు మనం తిరుమలలో చూస్తున్న విగ్రహం ఒక్కటేనా అన్నది సహజంగా ప్రతిఒక్కరిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న. రూపాలు ఎన్నైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా… కాలగర్భంలో కలిసిపోయిన ఆలయం, ఇప్పుడున్న తిరుమలలోని శ్రీవారు ఒక్కరే అనుకోవచ్చు. నారాయణుడు వైకుంఠం నుంచి తిరుమలకు దిగొచ్చి ఎలా నిలుచున్నాడో అదే రూపాన్ని గర్భాలయం గోపురంపైన విమాన వేంకటేశ్వర స్వామిగా నిర్మించి ఉంటారని పండితులు చెబుతున్నారు.