ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా జామి మండలం, అన్నమరాజుపేటలో కొలువైన శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన చిన్న శ్రీను కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు ‘పూర్ణకుంభం’తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను భార్య మజ్జి పుష్పాంజలి, నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మజ్జి శ్రీనివాసరావు కుటుంబానికి ఆశీర్వచనాలు అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.