వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో తన ఆస్తులు, రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకే చంద్రబాబు రాయలసీమను తాకట్టు పెడుతున్నారని రోజా ఆరోపించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఓటుకు నోటు కేసు భాగస్వామిగా పేర్కొంటూ రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా చెబుతున్నారని ఆమె గుర్తుచేశారు.
అంతేకాదు, రాయలసీమ అంటే ప్రాణమని తరచూ చెప్పే పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా ప్రశ్నించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై పవన్ స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒప్పందాలున్నాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే అసలైన బాధ్యత అని చెబుతూ, పవన్ కళ్యాణ్ నిజంగా రాయలసీమ అభిమాని అయితే ఈ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు–పవన్ రాజకీయ పొత్తుల వల్లే రాయలసీమ వెనుకబడుతోందని రోజా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచాయి.