•తీర ప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు
•మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం
•త్వరలో పిఠాపురం వేదికగా ప్రకటన
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికను రూపొందించాము. అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రణాళికలకు రూపం ఇచ్చాం. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీ కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించాం. తీర కాలుష్య నివారణ, కోత నివారణ, మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతులలో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, ఇలా మత్స్యకారులు జీవితాలకు భద్రత, భరోసా కల్పించేందుకు అవసరం అయిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రణాళికలో పొందుపర్చాము. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడంతోపాటు వ్యవసాయ అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం.
వివిధ శాఖల ఉన్నతాధికారులు, మెరైన్ ఫిషరీస్ నిపుణులు, జిల్లా అధికారుల సహకారంతో రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే పిఠాపురం పర్యటనలో ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్దుష్ట లక్ష్యంతో రూపొందించిన ప్రణాళిక – ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.