గుండె సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న కట్టా శ్రీహర్ష (3సంవత్సరాలు) వైద్యఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం సోమవారం హైదరాబాద్ లో అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తాటిపూడి గ్రామంకు చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు కట్టా శ్రీహర్ష కూకట్ పల్లి అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు పరిస్థితి తెలుసుకున్న శ్రీ నాగబాబు గారు విచారం వ్యక్తం చేస్తూ రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. త్వరగా కోలుకోవాలని శ్రీహర్ష తండ్రికి ధైర్యాన్ని నింపారు.
26 రోజుల క్రితం కట్టా శ్రీహర్ష అస్వస్థకు గురయ్యాడు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. గుండెనుండి రక్తం 10శాతం మాత్రమే పంపింగ్ అవుతుండడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. మొదట రూ. 10 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పినప్పటికీ, సీరియస్ కండిషన్ కారణంగా ఖర్చు పెరిగింది. ఇప్పటి వరకు 26 రోజులకు 13 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఇంకా 10 లక్షలు అవుతాయని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి కొంతమేరకు మెరుగ్గా ఉన్నది. బాబు తండ్రి కట్ట రామకృష్ణ సీసీ కెమెరా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. పసివాడి ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉన్నవారు చేతనైనంతలో సహాయం అందించాలని ఈ సందర్భంగా శ్రీ కె. నాగబాబు గారు పిలుపునిచ్చారు. శ్రీ అడబాల షణ్ముఖ, శ్రీ ధనపాల సందీప్ పాల్గొన్నారు.