పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో నేడు క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
సహాయక చర్యల విషయంలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీతో కలిసి చర్యలు చేపట్టింది. వారికి సహాయం కోసం 0863-2340678 హెల్ప్ లైన్ నెంబర్, 85000 27678 వాట్సప్ నెంబర్ను 24 గంటలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ ఎన్ఆర్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. ప్రవాసాంధ్రులు సంప్రదించిన వెంటనే ఏపీ ఎన్నార్టీ వారికి తక్షణం సహాయ, సహకారాలు అందించేలా ఏర్పాట్లు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు helpline@apnrts.com, support@apnrts.com, info@apnrts.com ఈ మెయిళ్లు, https://apnrts.ap.gov.in వెబ్సైట్ను కూడా సంప్రదించవచ్చు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు రక్షణ – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు