దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలకు సంబంధించి ‘ఓవర్ లోడ్’ నిబంధనలను కఠినతరం చేస్తూ ఏప్రిల్ 15, 2026 నుంచి కొత్త రూల్స్ను అమల్లోకి తెచ్చింది. ఇకపై పరిమితికి మించి భారంతో వెళ్లే వాహనాలకు భారీ జరిమానాలు తప్పవు. ఈ కొత్త ‘జాతీయ రహదారుల ఫీజుల నాలుగో సవరణ నిబంధన 2026’ ప్రకారం.. ని నిర్ణీత లోడ్ కంటే 10 శాతం వరకు అదనపు బరువు ఉంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. కానీ, ఆ బరువు 10 నుండి 40 శాతం మధ్యలో ఉంటే సాధారణ టోల్ ఫీజు కంటే 2 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓవర్ లోడ్ 40 శాతం దాటితే ఏకంగా 4 రెట్లు అదనపు జరిమానా వడ్డిస్తారు. ఈ మొత్తాన్ని కూడా నేరుగా ‘ఫాస్టాగ్’ (FASTag) ద్వారానే వసూలు చేయనున్నారు. ఇందుకోసం టోల్ ప్లాజాల వద్ద అత్యాధునిక ‘డిజిటల్ కాంటాలను’ ఏర్పాటు చేస్తున్నారు. ధర్మ కాంటాలు అందుబాటులో ఉన్న టోల్ గేట్ల వద్ద మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. రోడ్ల భద్రతను మెరుగుపరచడం, ఓవర్ లోడ్ వల్ల రహదారులు దెబ్బతినకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి, కేవలం డిజిటల్ విధానాలనే అనుమతిస్తున్న కేంద్రం, తాజా నిర్ణయంతో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల జేబుకు గట్టిగానే చిల్లు పెట్టనుంది. కాబట్టి ప్రయాణానికి ముందే మీ వాహన బరువును సరిచూసుకోవడం మర్చిపోకండి!