•స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేషీ అధికారులకు ఆదేశం
•భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం
కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని చేసేందుకు వెళ్లిన అన్నమయ్య జిల్లా, వాల్మీకిపురం గ్రామానికి చెందిన శ్రీమతి దూదేకుల షెహనాజ్ అనే మహిళ పని ప్రదేశంలో వేధింపులు తాళలేక సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వీడియో సందేశం పంపారు. పవన్ కళ్యాణ్ అన్నా కాపాడన్నా అంటూ రోదిస్తూ ఆమె పంపిన వీడియో ఉపముఖ్యమంత్రి గారిని కదిలించింది. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలు విని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించారు. ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు కార్యాలయ సిబ్బంది శ్రీమతి షెహనాజ్ ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె భర్త ద్వారా ఒమన్ లోని ఏజెంట్ తో మాట్లాడారు. అక్కడ దౌత్య కార్యాలయాన్ని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించారు. శ్రీమతి షెహనాజ్ ను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఉప ముఖ్యమంత్రివర్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.