రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. మచిలీపట్నం ఎంపీ శ్రీ బాల శౌరి గారు వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ శ్రీ ఉదయ్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై, వివరాలు అందించాలన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి సంబంధించిన కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదన్నారు. రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్ధిక సంవత్సరం రావాల్సిన నిధులు వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని వాటిని పరిశీలించి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళాలి అన్నారు.