హనుమంతుడు మహాబలవంతుడు. ఎన్ని అపాయాలు వచ్చినా ఆయన్ను తలచుకుంటే చాలు ఇట్టే తగ్గిపోతాయి. ఎవరైనా సరే సంపూర్ణ శరణాగతి పొందితే చాలు మన పక్కనే ఉండి మనల్ని రక్షిస్తాడు. హనుమంతుడి పాదాలే మనకు శ్రీరామరక్ష. భూతప్రేత పిశాచాలే కాదు… ఆ శనీశ్వరుడు సైతం స్వామివారిని ఏమీ చేయలేడు. శనీశ్వరుడు పట్టుకుంటే వదలడని, ఆయన మన పాదాల్ని ఎత్తి పడేస్తాడని అంటారు. సాక్షాత్తు మహాశివుడిని సైతం శనీశ్వరుడు భయపెట్టాడు. భస్మాసుడి రూపంలో ఆందోళన కలిగించాడు. ఇటువంటి శనీశ్వరుడు ఆంజనేయుడిని ఏమీ చేయలేకపోయాడట. పైగా ఆయన పాదాల వద్ద స్త్రీమూర్తి రూపంలో దాక్కున్నాడని, ఎవరైనా వచ్చి స్వామి పాదాలను తాకితే వారిని పట్టుకొని పీడించాలని అనుకున్నాడని అంటారు. హనుమంతుడి పాదాల వద్ద స్త్రీమూర్తి రూపమా. మాకు ఎక్కడా కనిపించలేదే. పైగా ఆయన ఆజన్మ బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె సువర్చలతో వివాహం జరిగినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. గురువు ఆదేశాల మేరకు మాత్రమే ఆయన సువర్చలను వివాహం చేసుకున్నాడు. కనీసం ఆమెను తాకినట్టుగా ఎక్కడా పురాణాల్లో చెప్పలేదు.
మహిళలు ఆంజనేయుడి పాదాలు తాకేందుకు కూడా భయపడతారు. దీని వెనుక రహస్యమేమంటే మహిళలకు అంటు ఉంటుంది. ఆ సమయంలో నియమాలు పాటించకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ మనిషిని వీలైనంత వరకు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఇంటికి దూరమైన మూడు నాలుగు రోజులు పూజగదికి దూరంగా ఉండాలి. భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. లేని పక్షంలో దుష్టశక్తుల ప్రవేశం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
అసలు శనీశ్వరుడు ఎవరు? ఎందుకు మనల్ని భయపెడుతుంటాడు
పురాణాల ప్రకారం తీసుకుంటే కర్మలను అనుసరించి వారిని పీడించే అవకాశం మహాశివుడు శనీదేవుడికి ఇచ్చాడు. శనిని శని అని కాకుండా శనీశ్వరుడు అని పిలవాలి. అప్పుడే ఆయన కరుణిస్తారు. ఇదంతా పక్కనపెడదాం. కర్మ ఫలాలను అనుసరించి శని పీడించే అవకాశం రావడంతో సామాన్య మానవులతో పాటు అటు దేవతలను కూడా శనీశ్వరుడు పీడించసాగాడు. తాను ఎవర్నైనా ఎలాగైనా పట్టుకుంటాననే గర్వం ఆయనలో పెరిగిపోయింది. అకారణంగా భూమిపై ఉన్న మానవులను, ఆకాశంలోని దేవతలను కూడా హింసిస్తూ ఆగ్రహంతో ఊగిపోతున్న శనీభగవానుడిని ఆగ్రహాన్ని చల్లార్చేందుకు హనుమంతుడు శనీశ్వరుడు నివశించే ప్రదేశానికి వెళ్తాడు. భూలోకానికి, దేవతా లోకాలకు ఉన్న తేడాలను వివరించి చెబుతాడు. ఎటువంటి కారణం లేకుండా ఎవరినీ శిక్షించవద్దని శనిదేవుడిని ప్రార్థించాడు. తప్పులు చేసిన వారికి మాత్రమే శిక్షలు వేసేలా ఉండాలని, అందర్నీ హింసించవద్దని అంటాడు. కానీ, శనీశ్వరుడు హనుమతుడు చెప్పింది వినకుండా ఆయన్ను కూడా అవమానిస్తాడు.
శనిదేవుని మానసిక స్థితిని గమనించిన హనుమంతుడు ఎలాగైనా ఆయన్ను సరైన మార్గంలో పెట్టాలని అనుకుంటాడు. తాను గొప్ప అని విర్రవీగుతున్న శనిదేవుడితో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం చాలా రోజులపాటు కొనసాగుతుంది. రోజులు గడిచేకొలది శనిదేవుడి శక్తి తగ్గపోవడం మొదలౌతుంది. అదే సమయంలో హనుమంతుడి శక్తి రెట్టింపవుతూ వస్తుంది. ఇంకా కొన్ని రోజులు యుద్ధం చేస్తే మరణం తప్పదని భావించి యుద్ధం నుంచి మధ్యలో పారిపోయి వచ్చేస్తాడు. హనుమంతుడి కోపాన్ని తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తాడు. హనుమంతుడు బ్రహ్మచారి అని, ఆయన స్త్రీలను ఎప్పుడూ బాధపట్టలేడని అర్ధం చేసుకుంటాడు. వెంటనే శనీశ్వరుడు స్త్రీ రూపాన్ని ధరించి హనుమంతుడి పాదాల వద్దకు చేరి శరణువేడుతాడు. స్త్రీ రూపంలో వచ్చి శరణు వేడటంతో ఆయన అభయాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి శనిదేవుడు హనుమంతుడి పాదాల వద్ద నివశిస్తున్నాడని, ఆయన పాదాలను తాకిని వారిని శనిదేవుడు పట్టుకుంటారని అంటారు. గుజరాత్లోని సారంగపూర్లో ఉన్న కాస్తభంజన్ హనుమాన్ ఆలయంలో మనం చెప్పుకున్న కథ తాలూకు విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడ హనుమాన్ విగ్రహం కింద స్త్రీమూర్తి రూపంలో శనిదేవుడు కనిపిస్తాడు. అందుకే కాస్తభంజన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ పాదాలను తాకవద్దని అంటారు.