విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి సాధారణంగా మొదకం, వడపప్పు, కుడుములు, చెరుకు గడలు అంటే చాలా ఇష్టం. పూజలోనూ, వినాయక చవితి రోజున వీటిని స్వామివారికి సమర్పిస్తారు. వీటితో పాటుగా స్వామివారికి అత్యంత ఇష్టమైనది ఎలక్కాయ. దీనిని స్వామి ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఎలగపండు నైవేధ్యంగా సమర్పించినవారి కోరికలను స్వామివారు నెరవేరుస్తారు. కానీ కోనసీమలోని అయినవిల్లి పుణ్యక్షేత్రంలో స్వయంభూవుగా వెలసిన సిద్ది వినాయకుడికి కొబ్బరికాయలంటే ఎక్కువ ఇష్టమట. స్వామిని దర్శించుకోవడానికి వెళ్లినవారు తప్పకుండా స్వామికి కొబ్బరికాయను సమర్పిస్తారు. ఇలా కొబ్బరికాయలను సమర్పించినవారి కోరికలను ఆయన ఇట్టే తీర్చేస్తారట. అందుకే అయినవిల్లి విఘ్నేశ్వరుడిని నారికేళ గణపతి అని పిలుస్తారు. ఇక్కడ స్వామిని దర్భలతో పూజించే పురాతనమైన సంప్రదాయం అమలులో ఉండటం విశేషం. ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు.
ఈ నారికేళ క్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయం కంటే పురాతనమైనదిగా చెబుతారు. ఇక్కడ ఆలయంలో శైవాగమన పద్దతుల ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తారు. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతోస్వామివారిని అభిషేకిస్తారు. ప్రతి నెలలోని కృష్ణ, శుక్లపక్ష చవితులు, దశమి, ఏకాదశి, వినాయక చవితి రోజుల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. అంతేకాదు, పరీక్షల మాసంగా చెప్పబడే మార్చి నెలలో లక్ష పెన్నులతో అర్చన చేస్తారట. విద్యార్ధులు పరీక్షలు బాగారాయాలని కోరుకుంటూ ఈ పెన్నులకు పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మరో విశేషమేమంటే స్వామివారిని దర్శించుకొని మొక్కుకున్నాక… ఆ కోరిక నెరవేరితే మొక్కులు చెల్లించుకునేందుకు తప్పకుండా మరోసారి ఆలయానికి రావాల్సిందే. అలా రాకుంటే స్వామివారు విఘ్నాలను కలిగిస్తారని భక్తుల నమ్మకం.
గణపతి భూమిపై స్వయంభూవుగా వెలసిన మొట్టమొదటి దేవాలయం ఇదేనని అంటారు. పురాణ కథనం ప్రకారం దక్షప్రజాపతి యజ్ఞం ప్రారంభించే ముందు అయినవిల్లి దేవాలయంలోనే పూజలు చేశారని అంటారు. ఆ సమయంలోనే వినాయకుడు ఇక్కడ స్వయంభూవుగా వెలిశారని ప్రీతితి. స్వయంభూవుగా వెలసిన స్వామివారిని వ్యాస మహర్షి ప్రతిష్టించారని చెబుతారు. దేవతలంతా కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కథనం. ఇక మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం చేస్తుండగా గణపతి ప్రత్యక్షమై స్వామివారు స్వయంభూవుగా వెలుస్తానని మాట ఇచ్చాడని ఆ ప్రకారమే ఇక్కడ స్వామి స్వయంభూవుగా వెలిశారని 14వ శతాబ్ధంలో శంకరభట్టు రాసిన శ్రీపాద వల్లభ చరిత్రలో ఉన్నది. ఇక్కడ స్వామివారు స్వయంభూవుగా వెలిసిన తరువాత ఓ ముగ్గురు వ్యక్తులు అవహేళన చేయగా… వారిని స్వామివారు మూగ, చెవిటి, గుడ్డివారిగా మారిపోవాలని శపించారని, ఆ తరువాత ఆ ముగ్గురే కాణిపాకంలోని గణపతి ఆవిర్భావాన్ని గుర్తించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కాణిపాకం కంటే ముందే అయినవిల్లి గణపతి ఆలయం ఉన్నట్టుగా అర్ధమౌతున్నది. ఇక్కడ మరో విశేషం ఏమంటే అన్ని ఆలయాల్లో గణపతి విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటే, అయినవిల్లి గణపతి ఆలయంలో విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. అందుకే అయినవిల్లి గ్రామంలోని చాలా మంది తమ ఇళ్లను దక్షిణ ముఖద్వారంతో కట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.