భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) సిద్దమౌతున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ప్రముఖులను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నది. ఇందులో భాగంగానే ఆహ్వానితులకు ఆహ్వాన పత్రికను పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి భవన్ అట్ హోమ్ ఆహ్వాన పత్రిక (At-Home Invitation) దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక భావనతో రూపొందించే ఈ ఆహ్వాన పత్రిక… ఈ ఏడాది భారతదేశ ఈశాన్య ప్రాంతాల (Northeast India)సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళల గొప్పతనాన్ని చాటేలా రూపొందించబడింది.
ఈ ఏడాది ఆహ్వాన కిట్లో అష్టలక్ష్మి రాష్ట్రాలుగా (Ashtalakshmi States) పిలవబడే ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల జీవనశైలి, కళా నైపుణ్యం స్పష్టంగా ప్రతిబింబించింది. చేతివృత్తులపై ఆధారపడి జీవించే అక్కడి కళాకారుల శ్రమ, సృజనాత్మకత ఈ ఆహ్వాన పత్రిక రూపంలో దేశానికి పరిచయం చేశారు. రంగుల ఎంపిక నుంచి డిజైన్ వరకు ప్రతీ అంశం ఈశాన్య భారత సంస్కృతికి ప్రతినిధ్యం వహించేలా తీర్చిదిద్దారు.
రాష్ట్రపతి భవనం నుంచి పంపిన ఈ ప్రత్యేక ఆహ్వానం కేవలం ఒక కార్యక్రమ పిలుపుగా మాత్రమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టే ప్రయత్నంగా నిలిచింది. ఆధునికతకు సంప్రదాయం జోడించి, హస్తకళలకు గౌరవం ఇచ్చేలా ఈ డిజైన్ను రూపొందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
ప్రత్యేకంగా, మరుగున పడుతున్న సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో ఈశాన్య రాష్ట్రాల కళాకారుల ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడం ఈ ఆహ్వాన పత్రిక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్లు, అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాదని, దేశ ఆత్మను ప్రతిబింబించే సంస్కృతి, కళలు కూడా అంతే ముఖ్యమని ఈ ఆహ్వానం గుర్తు చేసింది.
మొత్తంగా చూసుకుంటే… ఈ ఏడాది రాష్ట్రపతి భవనం నుంచి వచ్చిన ‘అట్-హోమ్’ ఆహ్వాన పత్రిక భారతదేశ ఏకత్వంలో వైవిధ్యాన్ని మరోసారి గర్వంగా చాటింది. ఆహ్వాన పత్రిక ఏవిధంగా ఉంటే ఈ వీడియో చూస్తే మీకు అర్ధమౌతుంది.