16 ఏళ్ల లోపు చిన్నారులు సోషల్ మీడియా, సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. పెద్దవాళ్ళకు చెడు ఏమిటి.? మంచి ఏమిటి.? అని ఆలోచించుకునే విచక్షణ ఉంటుంది. 16 ఏళ్ల లోపు చిన్నారులు మంచి ఏదో, చెడు ఏదో అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండరు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, డెన్మార్క్, ఐరోపా దేశాల్లో 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించారు. గతంలో బ్లూ వెల్స్ చాలెంజ్ కాన్సెప్ట్ లాంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది చిన్నారులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. మెమో చాలెంజ్, స్కల్ బ్రేకర్ చాలెంజ్, ఫైర్ చాలెంజ్ అంటూ ప్రాణాంతకమైన సాహసాలతో సోషల్ మీడియాలో చిన్నారులను ఆకర్షిస్తున్నారు.
ఇలాంటి వాటికి ఆకర్షితులవుతున్న చిన్నారులు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొంతమంది చిన్నారులు అనేక ఒత్తిళ్లకు, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. హోం శాఖ, ఐటీ శాఖ, విద్యా శాఖ పరస్పర సమన్వయంతో సోషల్ మీడియా కట్టడి కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం. విద్యార్థులకు విద్యా సంస్థల్లో అందిస్తున్న ట్యాబ్ లాంటి ఎలక్ట్రిక్ పరికరాల్లో కేవలం విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే వినియోగించుకునే విధంగా పరిమితం చేయాలి. విద్యార్థులకు అందించే ట్యాబుల్లో సోషల్ మీడియా వినియోగించకుండా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఐటీ శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ సమన్వయంతో సోషల్ మీడియా అరాచలకు అడ్డుకట్ట వేయాలి. పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్స్ సమయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.