పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ వ్యక్తి బాధను వ్యక్తం చేయగా వ్యక్తిగతంగా రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాం. చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి.
ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చం నాయుడు గారు, ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు చిరువ్యాపారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం కూడా ఆనందంగా ఉంది. ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని కోరుతున్నా. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్ళతీసుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం.
పెద్దగా మూలధనం లేకపోయినా, తమకాళ్లపై తాము నిలబడాలనే ఆలోచనతో కూడళ్లలో, ఎక్కువ జనసంద్రం ఉండే జాతర్లలో, చిన్నచిన్న దుకాణాలు పెట్టుకొని చిరుతిండి పదార్థాలు అమ్ముకుని జీవనం సాగించే వారు మనదేశంలో కోట్లమంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధార పడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.