బీఆర్‌ఎస్‌ ఖాతాలో ఇబ్రహీంపట్నం…ఆసక్తికరంగా మారిన ఖానాపూర్‌

Ibrahimpatnam Khanapur Municipality Election

తెలంగాణలో మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికలు ముగిసి చాలా రోజులైనప్పటికీ ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌ మున్సిపాలిటీల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక్కడ అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలు దాదాపు సమానమైన స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ఈ మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి మూడు పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా తీవ్రమైన దూషణలు చేసుకున్న బీఆర్ఎస్‌, బీజేపీలు ఒకరికొకరు సహకరించుకొని ఇబ్రహీంపట్నంను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌ కౌన్సిలర్‌ టేకుల సుదర్శన్‌ రెడ్డి చైర్మన్‌గా ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు.

ఇక ఇదిలా ఉంటే, ఖానాపూర్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ ఎన్నిక విషయంలో గందరగోళం నెలకొన్నది. అధికారులు బీజేపీ అభ్యర్థి మౌనిక పేరు పిలవగా స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట బీజేపీ అభ్యర్థిని ఎలా పిలుస్తారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రగడ జరిగింది. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తిరిగి ఎన్నిక ఎప్పుడు జరుపుతారన్నది చూడాలి. ఇక ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ 3, బీఆర్ఎస్‌ 4, బీజేపీ 4 చోట్ల విజయం సాధించింది. అయితే, ఈ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి ఒకరు కాంగ్రెస్‌లో చేరడం, ఎక్స్‌ అఫిషియో ఓటు కలవడంతో మొత్తం ఐదు స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో ఉన్నాయి. కానీ, ఖానాపూర్‌ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని అభ్యర్థిని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం చెప్పడం, సభలో గందరగోళం ఏర్పడటంతో ఎన్నికను వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *