Kailash Mysteries
హైందవ సనాతన ధర్మంలో జన్మనెత్తిన ప్రతి మానవుడు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తపించే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం “కైలాస మానస సరోవరం”. సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసస్థానమైన కైలాస పర్వతాన్ని చుట్టి రావడం (పరిక్రమణ) పుణ్యప్రదమే కానీ, ఈ పర్వతాన్ని అధిరోహించడం మాత్రం నేటికీ ఏ మానవుడికీ సాధ్యం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,848 మీటర్లు) వందలాది మంది అధిరోహించినా, అంతకంటే తక్కువ ఎత్తున్న కైలాస పర్వతాన్ని (6,638మీటర్లు) మాత్రం ఎవరూ ఎక్కలేకపోయారు. దీనికి కారణం ఈ పర్వతంలో దాగివున్న అనంతమైన దైవశక్తి మరియు ఆధ్యాత్మిక రహస్యాలే.
ఉత్తరాఖండ్లోని పిథోరఘర్ జిల్లా మీదుగా సాగే ఈ దివ్య యాత్రలో, కైలాసనాథుని చెంతకు చేరేలోపు భక్తులకు ప్రకృతి సిద్ధంగా కనిపించే కొన్ని అద్భుతాలు మూఢనమ్మకాలను సైతం పటాపంచలు చేసి, భక్తిభావంలో ముంచెత్తుతాయి.
1. ఓం పర్వతం: ప్రకృతి పలికే ప్రణవనాదం
కైలాస యాత్రలో ధార్చుల నుండి గంజి వైపు ప్రయాణించేటప్పుడు భక్తులకు మొట్టమొదటగా దర్శనమిచ్చేది “ఓం పర్వతం”. ఇక్కడ శీతాకాలంలో మంచు కురిసినప్పుడు, ఆ మంచు కొండలపై సహజసిద్ధంగా హిందూమత మూలమంత్రమైన “ఓం” ఆకృతి స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది. మానవ మాత్రులు ఎవరు సృష్టించని ఈ ప్రకృతి వింతను చూసి భక్తులు పులకించిపోతారు.
Also Read: అమ్మవారికి రాళ్లను నైవేద్యంగా సమర్పించే ఆలయం ఎక్కడుందో తెలుసా?
2. గణేష్ పర్వతం మరియు మృత్యుపాత జలపాతం
ఓం పర్వత దర్శనం తర్వాత ముందుకు సాగితే “గణేష్ పర్వతం” కనిపిస్తుంది. జూన్, జూలై మాసాలలో ఇక్కడ కురిసే మంచు, విఘ్నేశ్వరుని శూర్పకర్ణ (పెద్ద చెవులు), లంబోదర ఆకృతిని పొందుతుంది. పార్వతీపరమేశ్వరులు తమ పరివారంతో ఇక్కడే కొలువై ఉన్నారనడానికి ఇది నిదర్శనం.
ఈ కొండకు ముందే “గణేష్ నాలా” అనే ప్రమాదకరమైన జలపాతం ప్రవహిస్తుంది. దూరం నుండి చూడటానికి ఎంతో మనోహరంగా కనిపించే ఈ జలపాతాన్ని దాటడానికి ప్రయత్నించిన వారెవ్వరూ తిరిగి రాలేదని స్థానికులు చెబుతారు. అందుకే దీనిని ‘మృత్యుపాత’ అని పిలుస్తూ, భక్తులు దూరం నుండే నమస్కరించి ముందుకు సాగుతారు.
3. 14,000 అడుగుల ఎత్తులో వరిపంట: ఒక సజీవ సాక్ష్యం
హిమాలయాల్లోని మంచు కొండల్లో, కఠినమైన శీతోష్ణస్థితుల మధ్య సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో స్వయంగా వరిపంట పండటం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక రహస్యం. అంతటి చలిలో వేరే ఏ మొక్కా మొలవదు, కానీ వరి మాత్రం దానంతట అదే ఏటా మొలుస్తుంది.
దీని వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది. ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారని, ఆ సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన అన్నాన్ని పరమశివునికి నైవేద్యంగా పెట్టేందుకు భీమసేనుడు ఇక్కడ వరి సాగు చేశాడని స్థానికుల నమ్మకం. నాటి నుండి నేటివరకు ఆ వరిపంట ప్రతి ఏటా ప్రకృత్యంతర్గతంగా ఇక్కడ పండుతూనే ఉంది.
4. కుటి గ్రామం: పాండవుల అంతిమ ప్రయాణ వేదిక
వరిపంటను దాటుకుని ముందుకు వెళ్తే కైలాస యాత్రలో చివరి మజిలీ అయిన “కుటి గ్రామం” వస్తుంది. పాండవుల తల్లి కుంతీదేవి జ్ఞాపకార్థం ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. నేటికీ ఇక్కడి ప్రజలు కుంతీదేవిని గ్రామదేవతగా పూజిస్తారు.
ఈ గ్రామానికి సమీపంలో చుట్టూ నీటితో ఆవరించి ఉన్న ఒక చిన్న ద్వీపం వంటి ప్రదేశం ఉంది. ఇందులోకి వెళ్ళడానికి స్థానికులు ఎవరినీ అనుమతించరు. ఇక్కడున్న ఒక పురాతన భవనంలోనే పాండవులు, ద్రౌపదితో కలిసి సుదీర్ఘకాలం నివసించారని ప్రతీతి. ఇక్కడి నుండే వారు సశరీరంగా కైలాసానికి (స్వర్గారోహణ) బయలుదేరగా, వృద్ధాప్యం కారణంగా కుంతీదేవి ఇక్కడే ఉండిపోయి తనువు చాలించిందని చెప్తారు.
కైలాస మానస సరోవర యాత్ర కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు. అది ఒక అలౌకిక అనుభూతి. విజ్ఞాన శాస్త్రానికి సైతం లొంగని ఇటువంటి ఎన్నో సజీవ సాక్ష్యాలు, హిమాలయాల్లో దైవం ఉన్నాడనే సత్యాన్ని మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి.