•అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక
•కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు
•తమిళనాడు, కేరళల్లో విజయవంతమైన రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజంపై అధ్యయనం
•స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్ లో మత్స్యకార యువతకు శిక్షణ
•డిసెంబర్ లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మన మత్స్యకారుల సందర్శనకు ఏర్పాట్లు
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.
కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరింది. తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పనపైనా దృష్టి సారించాం. విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మత్స్య శాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నాం.
100 రోజుల ప్రణాళక అమలులో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం, వేట నైపుణ్యాన్ని పెంచడం, ప్రత్యేక రీఫ్ ల ఏర్పాటు, ప్రత్యామ్నయ ఆదాయ వనరుల సృష్టి తదితర అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించనున్నాం. మన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నాం.
•సముద్రంలోకి చేప పిల్లల విడుదల:
సంప్రదాయ వేట ఆధారంగా జీవనం సాగించే మత్స్యకార సోదరులు కాకినాడలో జరిగిన సమావేశంలో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల ఇబ్బందులుపడుతున్న విషయాన్ని తెలియచేసారు. ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించాం.రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంపొందించే చర్యల్లో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాల్లో 50 వేల పండుగప్ప పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు మత్స్యశాఖ సహకారంతో చర్యలు చేపడుతున్నాం.
•డీప్ సీ ఫిషింగ్ కు అనుమతి:
తీర ప్రాంత మత్స్యకారులు ఇప్పటి వరకు 12 నాటికల్ మైళ్ల దూరం వరకు మాత్రమే వేటాడే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించింది. డీప్ సీ ఫిషింగ్ ద్వారా మత్స్యకార సోదరులు మంచి ధర లభించే టూనా చేపలను పట్టుకునేందుకు వీలు కలుగుతుంది.
•కోనపాపపేటలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం:
ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కోస్టల్ రీజైలెన్స్ స్కీమ్ కింద కోనపాపపేటకు రూ. 2 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో తుపాను లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నాం. ఈ కమ్యూనిటీ హాళ్లలో ఆర్.ఒ. వాటర్ ప్లాంట్లు, చేపలు ఎండబెట్టుకునేందుకు వీలుగా మూడు ఫిష్ డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్ నిర్మించనున్నాం. వేటకు వెళ్లిన మత్స్యకారులను సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా జీపీఎస్ సిస్టం, మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు ఏర్పాటు చేయబోతున్నాం.
•తీర ప్రాంతంలో టూరిజం హాట్ స్పాట్లు:
తీర ప్రాంత మత్స్యకారులకు వేటతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైనా దృష్టి సారించాం. మత్స్యకారుల్లోని అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా మన రాష్ట్ర తీర ప్రాంతాలను టూరిజం హాట్ స్పాట్లుగా తీర్చిదిద్దనున్నాం. అందుకోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంత మంది మత్స్యకారులను కేరళ తీసుకువెళ్లి అక్కడ మత్స్యకారులు నిర్వహిస్తున్న ఎకో టూరిజం స్పాట్ల వద్ద శిక్షణ ఇవ్వనున్నాం. చెన్నై హార్బర్ సమీపంలోని తిరువత్రియుర్ కుప్పం తీరంతో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.
1500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టన్ను సామర్ధ్యం ఉన్న కృత్రిమ రీఫ్ లు సముద్రంలో ఉంచడం ద్వారా 300 రకాల సముద్ర జీవులను ఆకర్షించవచ్చు. అందులో కనీసం 50 రకాలు వాణిజ్య విలువ కలిగిన చేపలు ఉంటాయి. ఈ కల్చర్ ద్వారా రెండేళ్ల కాలంలో మత్స్యకారులకు రెండు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. డిసెంబర్ రెండో వారంలో ఉప్పాడ,కాకినాడ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాల సందర్శనకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. మత్స్యకార దినోత్సవ వేళ మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నాం.