ఈ రోజుల్లో వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. అయితే మంచి జీతం ఉన్నా, తరచూ ఉద్యోగాలు మారేవారికి రుణాలు పొందడం అంత సులభం కాదని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బ్యాంకులు కేవలం జీతం మాత్రమే కాదు, ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా ప్రధానంగా పరిశీలిస్తాయి.
ఒక ఉద్యోగంలో ఎక్కువకాలం కొనసాగుతున్న ఉద్యోగులను బ్యాంకులు నమ్మకమైన రుణగ్రహీతలుగా భావిస్తాయి. కానీ కొద్ది నెలలకోసారి కంపెనీలు మారితే, ఆ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణపై సందేహాలు వ్యక్తమవుతాయి. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో చేరిన వెంటనే రుణానికి దరఖాస్తు చేస్తే బ్యాంకులు వెంటనే ఆమోదించడానికి వెనుకాడుతాయి. దీనిని బ్యాంకులు “సెటిలింగ్ పీరియడ్”గా పరిగణిస్తాయి.
ఐటీ రంగంలో ఉద్యోగులు ఎక్కువ జీతాల కోసం తరచూ కంపెనీలు మారడం సాధారణమే. అలాంటి సందర్భాల్లో బ్యాంకులు కొంత సానుకూలంగా ఉన్నా, స్టార్టప్ కంపెనీల్లో పనిచేసేవారిపై మాత్రం అదనపు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఎందుకంటే స్టార్టప్లలో ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుందని బ్యాంకులు భావిస్తాయి. మరోవైపు, ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద ఎంఎన్సీల్లో పనిచేసే ఉద్యోగులకు రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నవారికి కూడా రుణాలు ఆలస్యంగా మంజూరు కావచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు దరఖాస్తులను తిరస్కరించే అవకాశమూ ఉంది. అందుకే ఉద్యోగం మారిన వెంటనే లోన్ కోసం అప్లై చేయకుండా కనీసం 6 నెలలు వేచి ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే మంచి క్రెడిట్ స్కోర్, సమయానికి ఈఎంఐ చెల్లింపులు, స్థిరమైన ఆదాయం వంటి అంశాలు రుణ ఆమోదంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఉద్యోగ మార్పులు చేసే ముందు భవిష్యత్తులో రుణ అవసరాలను కూడా ఒకసారి ఆలోచించడం అవసరం.