రోజూ మనం గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాం. ఆలయంలో భక్తులు లేరంటే గబగబ వెళ్లి దర్శనం చేసుకొని వెళ్లిపోతాం. మూలవిరాట్కు ఎదురుగా నిలబడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్లిపోతుంటారు. కానీ, గర్బగుడిలో మూలవిరాట్కు ముందు నిలబడి స్వామివారిని దర్శించుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం అపచారంతో సమానమని అంటారు. గుడి ఖాళీగా ఉన్నా, భక్తులతో నిండిపోయినా మూలవిరాట్ దర్శనం నేరుగా చేసుకోకూడదు. మరి స్వామివారి దర్శనం ఎలా చేయాలి. మూలవిరాట్కు ఎదురుగా నిలబడి ఎందుకు నమస్కరించకూడదు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడికి వెళ్లి స్వామివారికి నమస్కరించే సమయంలో మనం సాధారణంగా కొన్ని తప్పులు చేస్తుంటాం.
గుడికి వెళ్లినపుడు తప్పకుండా శుభ్రమైన దుస్తులు వేసుకొని వెళ్లాలి. మురికిగా ఉండే దుస్తులు వేసుకొని వెళ్లడం తప్పుగా పరిగణిస్తారు. గుడిలోపలికి వెళ్లే ముందు తప్పకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. జలంతో సంప్రోక్షణ చేసుకోవడం వలన శరీర శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా కలుగుతుంది. ఇక లోపలికి అడుగుపెట్టిన తరువాత నేరుగా గర్భగుడిలోకి వెళ్లకూడదు. ముందుగా ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద ఆగి నమస్కరించాలి. దర్శనం చేసుకున్న వెంటనే ఆలయంలో నేలపై సాష్టాంగ నమస్కారం చేయకూడదు. నమస్కారం చేసి కాసేపు కూర్చున్న తరువాతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత దేవుని సన్నిధిలో ఖాళీ చేతులతోనే ఉండాలి. పర్సులు, ఫోన్లు, ఇతర వస్తువులను చేతితో పట్టుకోరాదు. శివాలయంలో మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. అమ్మవారి ఆలయాల్లో పాదాభివందనం మాత్రమే చేయాలి. మహిళలైతే అర్థనమస్కారం చేయాలి. దీనినే నతముద్ర అని పిలుస్తారు.
దేవుడి ముందు నిలబడి స్వామిని ప్రార్థించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్దం చేయకూడదు. సెల్ఫోన్లలో మాట్లాడరాదు. పాటలు వినయడం చేయరాదు. గర్భగుడి ముందు నిలబడి నమ్రతతో తలదించుకొని నమస్కరించాలి. అహంభావంతో చూస్తూ ఉండటం అశుభంగా భావిస్తారు. వీటిని పక్కన పెడితే… మూలవిరాట్కి ఎదురుగా నిలబడి స్వామికి నమస్కరించకూడదు అని శాస్త్రం చెబుతున్నది.
దీనికి కారణాలు ఏమంటే… ఆకాశం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు వీటినే దైవకిరణాలు అని కూడా పిలుస్తారు. ఇవి గర్భగుడిపై ఉన్న కలశాన్ని తాకి గుడి లోపల ఉన్న స్వామివారి విగ్రహంపై పడి అక్కడి నుంచి ముందుకు ప్రసరిస్తాయి. స్వామివారిని తాకిన కిరణాలు అత్యంత శక్తివంతంగా మారతాయి. ఈ కిరణాలకు ఎదురుగా ఉంటే వాటిని తట్టుకోవడం చాలా కష్టం. కిరణాలు నేరుగా తాకితే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. అందుకే స్వామివారికి పూజించే సమయంలో గర్భగుడికి ఎడమ లేదా కుడి వైపున నిలబడి స్వామివారిని నమస్కరించాలి. ఇలా చేయడం వలన గర్భాలయం లోపలి నుంచి వచ్చే కిరణాలు నేరుగా కాకుండా పక్కనుంచి మనల్ని తాకుతాయి. ఈ కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి మనలో దైవత్వాన్ని, దైవం ఎడల సానుకూల దృక్పధాన్ని పెంచుతుంది. ఇక చాలా మంది మూలవిరాట్ రూపాన్ని చూడగనే వెంటనే కళ్లు మూసుకుంటాం. గర్భగుడిలోపలి మూలవిరాట్ను చూసిన వెంటనే కళ్లు మూసుకోకుడదు. కాసేపు విగ్రహాన్ని తదేకంగా చూసిన తరువాత మాత్రమే కళ్లు మూసుకోవాలి. ఇలా కళ్లు మూసుకుంటే ఆ స్వామివారు బృకుటి మధ్యభాగంలో స్థిరపడిపోతారని పండితులు చెబుతున్నారు. ఆ రూపాన్ని మనం కళ్లుమూసుకున్నా, కళ్లు తెరిచినా కనిపిస్తూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.