దేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు రాసుకుంటారు. జ్యోతిష్య, హైందవ సంప్రదాయాల ప్రకారం తీర్థం పవిత్రమైన జలం. దీనినే గంగాజలం అని కూడా పిలుస్తాం. భగవంతుడిని అభిషేకించిన తరువాత పవిత్రంగా మారిన జలాన్ని తీర్థంగా భక్తులకు అందిస్తారు. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాయడం ఓ అలవాటుగా మారింది. అయితే, ధర్మశాస్త్రాల ప్రకారం చేతిని తలపై త్రిపుండ్రం లేదా నమస్కారానికి సూచనగా రాయడం ద్వారా శుద్ధి, క్షమాపణ, దైవకృప పొందేందుకు సూచనగా చెబుతారు. తీర్థం అనేది ప్రసాదంగా చెబుతారు కాబట్టి దానిని తలపై ఉంచడం కూడా శుభదాయకమనే చెప్పాలి. ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసుకుంటే తీర్థం భౌతిక, మానసిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పుణ్యఫలాలను ఇస్తుంది. మనిషి తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. దీనినే శక్తికేంద్రంగా చెబుతాం. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలపై రాయడం వలన బ్రహ్మకేంద్రానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందని, పాపాలు క్షమించబడతాయని చెబుతారు. తీర్థం తీసుకున్న తరువాత ఎవరు తలపై చేతిని రాయకూడదు అనే దానిపై కూడా శాస్త్రాలు కొన్ని వివరణలు ఇచ్చాయి. మనసు మాలిన్యంతో నిండిపోయినవారు, భగవంతునిపై నమ్మకం లేనివారు, పలు రకాలైన చింతలున్నవారు చేతిని తలపై రాకూడదని చెబుతారు.
Latest News, Analysis, Trending Stories in Telugu