ఈ ఆధునిక యుగంలో చిన్నచిన్న విషయాలకే భార్యభర్తలు గొడవపడుతుండటం, ఆ గొడవల కారణంగా విడిపోతుండటం చేస్తుంటారు. ఒకవేళ ఇద్దరి మధ్య పెద్దలు సయోధ్యకుదిర్చినా… ఏదో ఒక విషయంలో చీకాకు పడుతూనే ఉంటారు. దీనికి పలు కారణాలున్నాయి. అందులో ఒకటి వాస్తు దోషాలు కూడా కావొచ్చని పండితులు చెబుతున్నారు. వాస్తు దోషాల కారణంగా భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు, కలహాలు వస్తుంటాయని పండితులు అంటున్నారు. గొడవలకు దారితీస్తున్న వాస్తు దోషాలేంటో ఇప్పుడు చూద్ధాం. దంపతుల పడకగది ఉత్తరదిశలో లేదా ఈశాన్యంలో ఉండటం వలన తరచుగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ దిశలను అశాంతి దిశలు అంటారు. ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదిని ఏర్పాటు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.
దంపతుల మధ్య అనురాగం, బలమైన బంధం ఏర్పడాలంటే దక్షిణ పశ్చిమ దిశలో పడకగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దిశలో పడకగది లేకుంటే దాంపత్యంలో కలహాలు ఏర్పడతాయి. దంపతులు విడిపోయే అవకాశం ఉంటుంది. పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దాన్ని ఉంచడం మంచిది కాదు. మంచానికి ఎదురుగా అద్దం ఉంచుకోవడం వలన ఆ గదిలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గదిలో ఉత్తర దిశలో తలను పెట్టుకొని నిద్రపోకూడదు. ఉత్తర దిక్కును పితృదేవతల దిశగా చెబుతారు. ఈ దిశలో నిద్రిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విభేదాలు పెరిగిపోతాయి. పడకగదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ నీలం, బూడిద రంగులు వేయకూడదు. ఈ రంగులు ఒంటరితనానికి చిహ్నం. మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పడకగదిలోని దక్షిణ తూర్పు లేదా ఈశాన్య దిశలో టాయిలెట్ ఉండకూడదు. ఇది పడకగదిలో శక్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా కూడా భార్యభర్తల మధ్య సంబంధాలు తెలిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ వాస్తు దోషాల నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని జపించాలి. పడక గదిలో శివపార్వతి లేదా రాధాకృష్ణుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.