బక్రీద్ పండుగ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయనగరంలో భద్రతా ఏర్పాట్లను మే 26న అర్ధరాత్రి ఎస్పీ స్వయంగా సీఐలు చౌదరి,శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. విజయనగరం వన్ టౌన్,టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్న మసీద్ లు ముస్లిం మతస్థులు ఉండే సున్నిత ప్రాంతాలను ఆకస్మిక సందర్శించి ఎస్ఐ,సీఐలకు సిబ్బందికి దిశానిర్దేశం చేసారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తత, గస్తీ నిర్వహణ విధానం, చెక్పోస్టుల పనితీరు, వాహన తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
రాత్రి పూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బృందాలతో ఎస్పీ దామోదర్ మాట్లాడి విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను మరింత పెంచాలని, రాత్రి గస్తీలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, పశువుల అక్రమ రవాణా అరికట్టాలని, గోవధ జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. వన్ టౌన్ పీఎస్ పరిధి కంటోన్మెంట్ బొగ్గుల దిబ్బ,గంజిపేట,కన్యకా పరమేశ్వరి, టూటౌన్ పరిధి మూడు లాంతర్లు,ఆబాద్ వీధి,కాట వీధి అంబటి సత్రం,ప్రెస్ క్లబ్ ప్రాంతాలలో ఈ తనిఖీలు చేసి అర్ధరాత్రి సంచరిస్తున్న వారిని ఎస్పీ స్వయంగా ఆపి, ఎక్కడనుండి వస్తున్నది, ఎక్కడికి వెళుతున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పండగ నేపద్యంలో జిల్లాలో ప్రత్యేక బృందాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, మొబైల్ పట్రోలింగ్ బృందాలను కూడా సిద్దం చేసామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.