తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసింది. ముత్యపు పందిరి వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనులు కదిలివచ్చారు.
ముత్యపు పందిరి – సకల సౌభాగ్య సిద్ధి
నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. ఈ వాహన సేవను దర్శించుకున్నవారికి స్వామివారి కృపాకటాక్షాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా జూన్ 2 నుంచి జూన్ 10 వరకు గోవిందరాజ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు గోవిందరాజ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి.