జనవరి 25న తిరుమలలో ఈ సేవలు రద్దు…కారణమేంటో తెలుసా?

Tirumala Rathasaptami 2026 TTD Cancels Arjitha Sevas and Special Darshan on January 25

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలలో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే మహాపర్వాల్లో రథసప్తమి ఒకటి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 25న తిరుమలలో భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

రథసప్తమి సందర్భంగా శ్రీవారు ఒక్కరోజులో ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడం సంప్రదాయం. ఈ మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో, భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. విజిలెన్స్, పోలీసు, భద్రతా బృందాలతో సమన్వయం చేసుకుని రథసప్తమి వేడుకలను అత్యంత శ్రద్ధగా నిర్వహించాలని ఆదేశించారు.

తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాల వరకు శ్రీవారి వాహనసేవలు అద్భుతంగా సాగనున్నాయి. ఈ సమయంలో ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర వైద్య సేవలు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకుల సేవలు సజావుగా అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉండటంతో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, అలాగే ఎన్‌ఆర్‌ఐ, సీనియర్ సిటిజన్, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ కూడా నిలిపివేసింది.

శ్రీవారి కృపతో రథసప్తమి మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే మహానుభూతిగా నిలవనుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read  Karna: ఇలా చేస్తే దానంలో కర్ణుడిని మించిపోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *