Telugu States Heatwave Alert 2026
తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన ఎండలు వణికిస్తున్నాయి. పగలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు అగ్నిగోళంలా మారిపోతుండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 43°C నుంచి 47°C వరకు నమోదు అవుతున్నాయి.
వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం భద్రాచలంలో అత్యధికంగా సుమారు 47°C వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్కరోజులోనే 2°C నుంచి 3°C వరకు ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 44°C నుంచి 47°C మధ్య నమోదవుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యంత ప్రమాదకరమైన వేడి పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రి కురిసిన వర్షాలు తాత్కాలిక ఉపశమనం ఇచ్చాయి. ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు నీరు ఎక్కువగా తాగాలని, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వాడాలని సూచనలు జారీ చేసింది.